నకిలీ కన్సల్టెన్సీ గుట్టురట్టు

by Dishafeatures2 |
నకిలీ కన్సల్టెన్సీ గుట్టురట్టు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భారీ మొత్తాల్లో డబ్బు తీసుకుంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఉద్యోగార్థులను అమెరికా పంపిస్తున్న నకిలీ ఇమ్మిగ్రేషన్​కన్సల్టెన్సీ నిర్వాహకులను ఎల్బీనగర్​ ఎస్వోటీ అధికారులు, నేరెడ్​మెట్​ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. నిందితుల నుంచి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసిన 16 నకిలీ గుర్తింపు కార్డులు, 5 పాస్​పోర్టులు, వేర్వేరు బ్యాంకులకు చెందిన 279 చెక్కులు, నకిలీ ఇన్విటేషన్​ లెటర్లు, యాక్సిస్​ బ్యాంక్​ నుంచి జారీ అయిన అమెరికా వీసా ఫీజు రిసిప్టులు, బ్యాంకు లెటర్లు, ఒక కంప్యూటర్, ఒక ల్యాప్​టాప్, కలర్​ ప్రింటర్​తో పాటు నాలుగు మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 18వేల రూపాయల నగదును సీజ్​చేసి వేర్వేరు బ్యాంకు అకౌంట్లలో ఉన్న 7లక్షల రూపాయలను ఫ్రీజ్​చేశారు. రాచకొండ పోలీస్​కమిషనర్​ డీ.ఎస్.చౌహాన్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మచ్చబొల్లారం స్రవంతి నగర్​ నివాసి గార్లపాటి వెంకటదుర్గ నాగేశ్వర సిద్దార్థ (38) ఆరేళ్ల క్రితం సికింద్రాబాద్​ప్రాంతంలో ఆంథోనీస్ ​ఇమ్మిగ్రేషన్స్ ​పేర కన్సల్టెన్సీ ఆఫీస్​ తెరిచాడు. ఓల్డ్​అల్వాల్​నివాసి అయిన ఎన్.ప్రభాకర్​రావు (48) సహాయంతో దీనిని నడుపుతున్నాడు. ఫైనాన్స్ ​వ్యాపారం చేస్తున్న బోడుప్పల్​ వెంకట్​రెడ్డి నగర్​ నివాసి జీ.నాగరాజు (33) తదితరులతో సహాయంతో అక్రమ దందాకు తెర లేపాడు. వాస్తవానికి అమెరికాలో నివాసముంటున్న భారతీయ భార్యాభర్తలు తమ బంధువులను రప్పించుకోవటానికి పంపించే స్పాన్సర్​ షిప్​ లెటర్లను సంపాదిస్తున్న నాగేశ్వర సిద్దార్థ్ ​తన వద్దకు అమెరికాలో ఉద్యోగం చేయాలన్న కోరికతో వచ్చిన వివరాలను వాటిల్లో పొందుపరిచి నకిలీ స్పాన్సర్​ షిప్ ​లెటర్లు తయారు చేసేవాడు. దాంతో పాటు తనను ఆశ్రయించిన వారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని నకిలీ గుర్తింపు కార్డులు రూపొందించేవాడు.

ఈ కార్డులను చూసిన అమెరికన్​ కాన్సులేట్​ సిబ్బంది అమెరికా వెళుతున్నవారు తమ బంధువులతో కొన్నాళ్లు గడిపి తిరిగి వచ్చేస్తారని నమ్మి వీసాలు మంజూరు చేసేవారు. అంతకు ముందు నాగేశ్వర సిద్దార్థ తనకు పరిచయం ఉన్న ఫైనాన్స్​ వ్యాపారి నాగరాజుతో ఉద్యోగార్థులను కలిపేవాడు. ఇక, రోజుకు 1.5 శాతం వడ్డీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని నాగరాజు అమెరికా వెళ్లాలనుకునే వారి పేర నేరెడ్​మెట్​ డిఫెన్స్​ కాలనీలో ఉన్న జాగృతి కో–ఆపరేటీవ్ ​యూనియన్ ​బ్యాంక్​ లిమిటెడ్​లో ఖాతాలు తెరిచి వాటిల్లో 40 నుంచి 50 లక్షల రూపాయలు డిపాజిట్లుగా పెట్టేవాడు. ఇక, కాన్సులేట్​ సిబ్బంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి జవాబులు చెప్పాలి? అన్నదానిపై సిద్దార్థ నాగేశ్వర తన వద్దకు వచ్చిన వారికి అవగాహన కల్పించేవాడు. వీసా మంజూరు కాగానే మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. దీనికి ముందు ప్రాసెసింగ్​ ఫీజు పేర లక్షన్నర రూపాయలు తీసుకునేవాడు.

ఇలా దాదాపు అరవై మందిని అమెరికన్ ​కాన్సులేట్లో జరిగే ఇంటర్వూలకు పంపించానని, వీరిలో పదిమంది అమెరికాకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని విచారణలో నాగేశ్వర సిద్దార్థ వెల్లడించినట్టు కమిషనర్​ డీ.ఎస్.చౌహాన్​ చెప్పారు. నిజామాబాద్​ జిల్లా బుస్సాపూర్​ గ్రామానికి చెందిన జక్కుల నాగేశ్వర్​(45) ఇలాగే అమెరికా వెళ్లటానికి నాగేశ్వర సిద్దార్థను ఆశ్రయించగా అతని పేర తెలంగాణ ఇరిగేషన్​ శాఖలో పని చేస్తున్నట్టు నకిలీ గుర్తింపు కార్డు తయారు చేశాడు. కాగా, నాగరాజ సిద్దార్థ చేస్తున్న ఈ దందా గురించి సమాచారం అందుకున్న ఎల్బీనగర్​ఎస్వోటీ అధికారులు, నేరెడ్​మెట్ ​పోలీసులతో కలిసి కన్సల్టెన్సీపై దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసిన మల్కాజిగిరి డీసీపీ జానకి, ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఇన్​స్పెక్టర్ ​సుధాకర్​ తదితరులను కమిషనర్​ అభినందించారు.



Next Story

Most Viewed