- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ PMJ జ్యువెలరీ దోపిడీ కేసు.. ముగ్గురు నిందితులు అరెస్ట్
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు సంబంధించి వివరాలను సీపీ గౌస్ ఆలం మీడియాకు వివరించారు.

దిశ, వెబ్డెస్క్: కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ అభిషేక్ గౌస్ ఆలం (CP Ghaus Alam) వెల్లడించారు. ఈ దోపిడీ కేసును తమ సిబ్బంది ఒక సవాల్గా తీసుకుని, అత్యంత చాకచక్యంగా ఛేదించారని ఆయన కొనియాడారు. ఈ భారీ దోపిడీ వెనుక బీహార్ జైలులో ఉన్న కుప్రసిద్ధ గ్యాంగ్స్టర్, ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ హస్తం ఉందని దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. జైలు నుంచే అతను ఈ పథకాన్ని రూపొందించాడని వివరించారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్..
ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్తో పాటు రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 51 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులు, మరియు నిందితులు వాడిన నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు అత్యంత ప్రమాదకరమైన వారని, దోపిడీకి రెండు నెలల ముందే వీరు తెలంగాణకు చేరుకున్నారని సీపీ తెలిపారు. ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ వంటి పట్టణాల్లో క్షుణ్ణంగా రెక్కీ నిర్వహించారని, పోలీసులకు చిక్కకుండా నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు, నకిలీ గుర్తింపు కార్డులను వాడారని పేర్కొన్నారు.
త్వరలోనే సొత్తు రికవరీ..
మే 3న పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు, నలుగురు సిబ్బందిని తుపాకులతో బెదిరించి, ఎదురుతిరిగిన వారిపై కాల్పులు జరిపారు. సుమారు రూ. 82.02 లక్షల విలువైన 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాలను దోచుకెళ్లారని సీపీ వివరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకోవడానికి, చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేయడానికి 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు. త్వరలోనే అందరినీ పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని, వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు.






