నల్గొండలో విషాదం: కాలువలో దూకి నీటిపారుదల శాఖ ఈఈ ఆత్మహత్య

by Bhoopathi Nagaiah |

నల్గొండ జిల్లా నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE)గా పనిచేస్తున్న సతీష్ చంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నల్గొండలో విషాదం: కాలువలో దూకి నీటిపారుదల శాఖ ఈఈ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లా నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE)గా పనిచేస్తున్న సతీష్ చంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పరిధిలోని చందనపల్లి సమీపంలో ఉన్న D37 కాల్వలోకి దూకి ఆయన తన తనువు చాలించారు. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ నీటిపారుదల శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సతీష్ చంద్ర, ఈరోజు ఉదయం చందనపల్లి వద్దకు చేరుకుని, ఎవరూ లేని సమయం చూసి ఒక్కసారిగా కాల్వలోకి దూకారు. స్థానికులు గమనించి అప్రమత్తమయ్యే లోపే ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, నీటిపారుదల శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన అనంతరం ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.

మిస్టరీగా మారిప ఆత్మహత్య:

సతీష్ చంద్ర ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డారా? లేక విధి నిర్వహణలో ఏవైనా పని ఒత్తిళ్లు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. నీటిపారుదల శాఖలో సౌమ్యుడిగా పేరున్న అధికారి ఇలా ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడంతో తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సతీష్ చంద్ర మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ఆఖరిగా ఎవరితో మాట్లాడారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Next Story