డ్రగ్స్​ కేసులో కొనసాగుతున్న ప్రకంపనలు

by Dishafeatures2 |
డ్రగ్స్​ కేసులో కొనసాగుతున్న ప్రకంపనలు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: డ్రగ్స్​కేసు నేపథ్యంలో టాలీవుడ్​లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు దర్యాప్తు అధికారులు కే.పీ.చౌదరిని జరిపిన విచారణలో బయటపడ్డ పేర్ల ఆధారంగా నోటీసులు ఇవ్వాలని భావిస్తుంటే ఎలాంటి విచారణకైనా మేం సిద్ధమంటూ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అరెస్టయిన చౌదరి ఫోన్లలో మా నెంబర్లు ఉన్నంత మాత్రానా మేం డ్రగ్స్​తీసుకున్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. తమ మొబైల్​నెంబర్లను దర్యాప్తు అధికారులు పబ్లిక్​చేయటాన్ని తప్పు పడుతున్నారు. అవసరమైతే దీనిపై కోర్టుకు కూడా వెళ్లటానికి సిద్ధమని చెబుతున్నారు. ఇక, ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే ఈ కేసు కోర్టులో నిలబడదని పోలీసుశాఖకు చెందిన కొందరు సీనియర్​అధికారులే చెబుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు. డ్రగ్స్​విక్రయాలు జరిపితేనే నేరమని వివరిస్తున్నారు.

రజనీకాంత్​హీరోగా నటించిన కబాలీ సినిమా తెలుగు వర్షన్ ​నిర్మాత కే.పీ.చౌదరి ఇటీవల కిస్మత్​పురా చౌరస్తా వద్ద కొకైన్​అమ్ముతుండగా మాదాపూర్​ఎస్వోటీ అధికారులు, రాజేంద్రనగర్​పోలీసులతో కలిసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోర్టు అనుమతితో చౌదరిని కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు రెండు రోజులపాటు విచారణ జరిపారు. దీంట్లో బ్యాడ్మింటన్​ప్లేయర్​సిక్కిరెడ్డి, ఈ నగరానికి ఏమైంది సినిమా హీరో సుశాంత్​రెడ్డి, ఆషూరెడ్డి, రఘుతేజ, సనామిశ్రా, నితినేశ్, భరత్, ప్రతాప్, జ్యోతిరెడ్డి, సురేఖావాణి, నవీన్​రెడ్డితోపాటు మరికొందరితో చౌదరి వందల సంఖ్యలో ఫోన్లలో మాట్లాడినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని భావిస్తున్నట్టు తెలిపారు.

నెంబర్లు ఉంటే డ్రగ్స్ వాడినట్టేనా..?

ఈ క్రమంలో పోలీసుల ద్వారా పేర్లు వెల్లడైన సెలబ్రెటీలు పలువురు స్పందించారు. బ్యాడ్మింటన్​ప్లేయర్​సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇప్పటికీ దేశం తరఫున బ్యాడ్మింటన్​ఆడుతోందన్నారు. ఈ క్రమంలో ఆమెకు తరచూ డోపింగ్​పరీక్షలు జరుగుతుంటాయ్నారు. నిజంగా తన కూతురు డ్రగ్స్​తీసుకుంటే ఆ విషయం ఎప్పుడో బయటపడేదన్నారు. చౌదరి పరిచయం ఉన్న నేపథ్యంలో పార్టీ చేసుకుంటానంటే తన ఫ్లాట్​ను ఇచ్చిందని, పార్టీ జరిగిన సమయంలో సిక్కిరెడ్డి అసలు దేశంలోనే లేదని చెప్పారు. ప్రస్తుతం కూడా సిక్కిరెడ్డి డెన్మార్క్​లో ఉందని తెలిపారు. ఇక, ఈ నగరానికి ఏమైంది అన్న సినిమాలో హీరోగా నటించిన సుశాంత్​రెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణల మీద స్పందించారు. చౌదరి ఫోన్​లిస్టులో పేరుంటే నేను డ్రగ్స్​వాడుతున్నట్టా? అని ప్రశ్నించారు. ఎలాంటి పరీక్షకైనా తాను సిద్ధమన్నారు. ఆషూరెడ్డి సోషల్​మీడియా ద్వారా స్పందిస్తూ దర్యాప్తు అధికారులు తన వ్యక్తిగత మొబైల్​నెంబర్​ను బయటకు ఎలా లీక్​చేస్తారని ప్రశ్నించారు. కొంతమందితో తనకున్న పరిచయాలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అవసరమైనపుడు ఈ అంశంపై స్పందిస్తానన్నారు.

అసలిది కేసేనా...?

ఇక, పోలీసుశాఖకు చెందిన సీనియర్​అధికారి ఒకరు మాట్లాడుతూ అసలిది కేసేనా? అని వ్యాఖ్యానించారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఎవరైనా డ్రగ్స్​సేవిస్తే వారిని బాధితులుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. వీరికి గుర్తింపు పొందిన రిహాబిలేషన్​సెంటర్లలో చికిత్స అంద చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అనుమానితుల జాబితాలో ఉన్నవాళ్లంతా డ్రగ్స్​సేవించినట్టుగా భావిస్తున్న వారే అని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి నోటీసులు ఎలా ఇస్తారు? ఇచ్చి ఏం విచారణ చేస్తారు? అని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారులు ఇంత హడావిడి చేయటానికి మరేవైనా కారణాలు ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు.

Next Story