ప్రాణాలు తోడేసిన పోలిస్ స్టేషన్ పంచాయితీ

by Dishafeatures2 |
ప్రాణాలు తోడేసిన పోలిస్ స్టేషన్ పంచాయితీ
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పోలిస్ స్టేషన్లు పంచాయితీలకు అడ్డాలుగా మారాయి. పోలిసులు, లీడర్లు మిలాఖాత్ అయి క్రిమినల్, సివిల్.. ఇలా అన్ని కేసులను సెటిల్ మెంట్ చేస్తున్నారు. దుడ్డు ఉన్నోడిదే రాజ్యంగా మారి ప్రేండ్లి పోలిస్ మాటున చేస్తున్న పంచాయితీలు ఓ యువకుడి ప్రాణాలు తీశాయి. భీమ్‌గల్ పోలిస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన జంగం శివాయి అభిరామ్ తేజ్ (22) మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోగా గురువారం రాత్రి చికిత్స పోందుతు చనిపోయాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జంగం శివాయి అభిరామ్ తేజ్ గల్ప్ దేశాల్లో పని చేసి గ్రామానికి తిరిగొచ్చి ప్రైవేట్ ఎలక్ర్టిషియన్ గా పని చేస్తు జీవిస్తున్నాడు.

అయితే అదే గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం ఉందని, ఆ కారణంగానే ఆమె గర్భం దాల్చిదంటూ కొంత మంది స్థానిక నాయకులు ఆ యువకుడిని వేధిస్తున్నారు. ఈ విషయంలో భీంగల్ పోలిస్ స్టేషన్ లో పంచాయితీ నిర్వహించారు. సదరు వివాహిత భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భానికి యువకుడే కారణమని, ఆమెను తక్షణమే పెళ్లి చేసుకోవాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని అభిరామ్ తేజ్ తనకు 3 రోజుల గడువు కావాలని పెద్ద మనుషులకు చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లిన సదరు యువకుడు మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అభిరాం చనిపోయాడు.


అగమేఘాల మీద కేసు నమోదు

పోలీసుల సమక్షంలో జరిగిన పంచాయితీ వల్ల యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ నెల 20న వివాహిత మృతుడిపై కంప్లైంట్ చేస్తే ఆ యువకుడు సూసైట్ అంటెంప్ట్ చేశాక ఈ నెల 21న పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు మహిళ ఫిర్యాదు చేసినప్పుడే అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటే యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయితీ పేరుతో పోలీసులకు గురి చేశారని, ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని వాపోయారు. ఈ విషయంపై భీంగల్ ఎస్సై రాజ్ భరత్ రెడ్డి ని వివరణ కోరిగా.. లింగపూర్ గ్రామానికి చెందిన వివాహితతో అబిరాం తేజ్ శారీరక సంబంధం పెట్టుకొని వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదని ఫిర్యాదు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే మృతునిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి నలుగురు సమక్షంలో మాట్లాటడగా.. వివాహం చేసుకుంటానని సదరు యువకుడు అగ్రిమెంట్ రాసిచ్చాడని తెలిపారు.

మృతదేహంతో బంధువుల నిరసన

తమ కుమారుడు జంగం శివాయి అభిరామ్ తేజ్ అత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు పోలిస్ స్టేషన్ లో పంచాయతీ చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లెల లక్ష్మణ్ ఇంటి వద్ధ డేడ్ బాడి ఉంచి నిరసన తెలిపారు. లక్ష్మణ్ డౌన్ డౌన్, వి వాంట్ జస్టిస్ అంటు నినాదాలు చేశారు. లింగపూర్ గ్రామానికి చెందిన సుంకరి రాజన్న, గట్టు ఈశ్వర్ లు కలిసి భీమ్‌గల్ పట్టణానికి చెందిన పురస్తు నరేష్, మున్సిపల్ మాజీ చైర్మెన్ భర్త మల్లెల లక్ష్మణ్, నీలం రాజలింగం, నీలం రమేష్, శెవ్వ సుమన్ లతో కలిసి వివాహిత మహిళను పెళ్లి చేసుకోవాలని అభిరాం తేజ్ ను బలవంతం చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. అందరు కలిసి అభిరాం తేజ్ ను కిడ్నాప్ చేయడమే కాకుండా పోలిస్ స్టేషన్ కు తీసుకువెళ్లి వివాహితను పెళ్లి చేసుకుంటానని మృతుడితో ఒప్పంద పత్రం రాయించుకున్నారని మండిపడ్డారు. ఏడుగురు వ్యక్తులు కలిసి చేసిన ఒత్తిడి వల్లే తీవ్ర మనస్తాపానికిలోనై అభిరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed