బంగారం లూటీ కేసులో పోలీసుల ​వేట

by Dishafeatures2 |
బంగారం లూటీ కేసులో పోలీసుల ​వేట
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఐటీ అధికారుల ముసుగులో ఆగంతకులు కిలోన్నరకు పైగా బంగారు నగలను తీసుకుని ఉడాయించిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేరానికి పాల్పడింది మహారాష్ర్టకు చెందిన గ్యాంగ్​ అని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందాలు మహారాష్ర్టలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాయి. సికింద్రాబాద్​ మోండా మార్కెట్ ​ప్రాంతంలోని హర్ష జువెలర్స్ కు శనివారం అయిదుగురు వ్యక్తులు వచ్చి తమను తాము ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. సిద్ధం చేసి పెట్టుకున్న నకిలీ గుర్తింపు కార్డులను చూపించటంతో జువెలరీ షాపులో మేనేజర్​గా పని చేస్తున్న మధుకర్​తో పాటు మిగిలిన సిబ్బంది వచ్చింది నిజంగానే ఐటీ అధికారులని నమ్మారు.

రికార్డులు పరిశీలించినట్టుగా కొద్దిసేపు హడావిడి చేసిన అగంతకులు ఆదాయం పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ షాపులో ఉన్న 170 తులాల బంగారు బిస్కెట్లు, నగలను మూటగట్టుకున్నారు. వీటిని సీజ్​చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తరువాత మధుకర్ ​పక్కనే ఉన్న జువెలరీ షాపుల్లో కూడా దాడులు జరిగాయా? అని వాకబు చేయగా జరగలేదని తెలిసింది. దాంతో తమ షాపులో ఐటీ అధికారులు దాడి చేసి బంగారాన్ని సీజ్​ చేసుకెళ్లారని మధుకర్​ ఇతర జువెలరీ వ్యాపారులతో చెప్పాడు. నగలను సీజ్ ​చేసినట్టు అధికారికంగా ఏదైనా లెటర్​ ఇచ్చారా? అని వాళ్లు ప్రశ్నించగా లేదని తెలిపాడు. దాంతో మిగితా వ్యాపారులు ఆదాయపు పన్ను శాఖ అధికారులైతే ఖచ్చితంగా నగలను స్వాధీనం చేసుకున్నట్టుగా సీజర్​పంచనామా చేసి ఇస్తారని మధుకర్​తో చెప్పారు. దాంతో మోసం జరిగిందని గ్రహించిన మధుకర్​ మోండా మార్కెట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా నగలతో పరారైన దుండగులు ముందుగా ఆటోలో జూబ్లీ బస్​స్టేషన్​కు వెళ్లినట్టు గుర్తించారు. అక్కడి నుంచి కూకట్​పల్లి వైపు వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. పటాన్​చెరు ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో కూడా దొంగల కదలికలు నమోదైన నేపథ్యంలో ఈ ముఠా మహారాష్ర్టకు చెందినదై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్, లా అండ్ ​ఆర్డర్​కు సంబంధించిన అయిదు ప్రత్యేక పోలీసు బృందాలు నిందితులను గాలిస్తూ మహారాష్ర్టలోని వేర్వేరు ప్రాంతాలకు బయల్దేరి వెళ్లాయి. అదే సమయంలో హర్ష జువెలర్స్​లో పని చేస్తున్న సిబ్బందిలో ఎవరికైనా ఈ గ్యాంగ్ ​సభ్యులతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story

Most Viewed