గో అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి–కొత్వాల్​ఆనంద్​

by Dishafeatures2 |
గో అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి–కొత్వాల్​ఆనంద్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అక్రమ గో రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టాలని హైదరాబాద్​పోలీస్​కమిషనర్​సీ.వీ.ఆనంద్​సూచించారు. దీనిని అడ్డుకోవటానికి చెక్​పాయింట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. త్వరలోనే బక్రీద్​జరుగనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్​కమాండ్​కంట్రోల్​సెంటర్​లో బుధవారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. దీంట్లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన అధికారులతోపాటు జీహెచ్ఎంసీ, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో గో అక్రమ రవాణాపై దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వాధీనం చేసుకున్న గోవులను పెట్టే కేంద్రాల వద్ద పశు వైద్యులను సిద్ధంగా పెట్టాలని తెలిపారు. ఇక, గోవులకు ఆహారం, మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్​ప్రియాంక అల మాట్లాడుతూ యానిమల్​షెల్టర్ల వద్ద అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కల్పించినట్టు తెలియచేశారు.

రోడ్లు, కుంటలు, ఓపెన్​డ్రౌనేజీల వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే స్పందించటానికి వెటర్నరీ బృందాలను కూడా సిద్ధంగా ఉంచనున్నట్టు చెప్పారు. ఇక, స్థానిక పోలీసులు, పశు సంవర్ధక శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కమిషనర్​ఆనంద్​సూచించారు. చెక్​పాయింట్ల వద్ద ఇరవై నాలుగు గంటలపాటు ఈ బృందాలు నిఘా పెట్టాలని చెప్పారు. కొంతమంది వ్యక్తులు, బృందాలు సమస్యలను ఉత్పన్నం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలిపారు. వీళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చన్నారు. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు. దీనిపై ఆయా జోన్ల డీసీపీలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ట్రాఫిక్​సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైనంత మంది డ్రైవర్లను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ఐపీఎస్​అధికారులు విక్రమ్​సింగ్​మాన్, ఏ.ఆర్.శ్రీనివాస్, జే.పరిమళ హన నూతన్, ఎం.శ్రీనివాసులు, ఎం.సత్యనారాయణ, ఐఏఎస్​అధికారిణి ప్రియాంక అలతోపాటు పశు సంవర్ధక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.



Next Story