లోన్లు ఇప్పిస్తమంటూ జనానికి కుచ్చుటోపీ.. ఎట్టకేలకు అరెస్ట్

by Dishafeatures2 |
లోన్లు ఇప్పిస్తమంటూ జనానికి కుచ్చుటోపీ.. ఎట్టకేలకు అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: లోన్లు ఇప్పిస్తామంటూ నమ్మించి అయిదు కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన గ్యాంగ్​ను హైదరాబాద్​ నేరపరిశోధక విభాగం సైబర్​క్రైం పోలీసులు శుక్రవారం ఢిల్లీలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి పదిహేడు మొబైల్​ఫోన్లు, ఏడు ల్యాప్​టాప్లు, ఒక కంప్యూటర్​ను స్వాధీనం చేసుకున్నారు. సైబర్​ క్రైమ్స్​డీసీపీ స్నేహా మెహ్రా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

సీనియర్​ సిటిజన్ ​ఫిర్యాదుతో..

హైదరాబాద్​కు చెందిన ఓ సీనియర్​సిటిజన్​ఇల్లు కట్టుకోవటానికిగాను రుణం తీసుకోవాలని నిర్ణయించుకుని కొంతకాలం క్రితం గూగుల్​లో లోన్ కంపెనీల కోసం సెర్చ్​చేశాడు. ఈ క్రమంలో అతనికి రిలయన్స్​ఫైనాన్స్​కంపెనీ ప్రతినిధిని అంటూ అభినవ్​అనే వ్యక్తి కాల్​చేశాడు. లోన్ ప్రాసెస్​చేయటానికి ఎలాంటి రుసుము ఉండదని చెప్పిన సదరు అభినవ్​ ఆ తరువాత రిజిస్ర్టేషన్​ఫీజు, ప్రాసెసింగ్​ఫీజు, కాంటింజెన్సీ డెవలప్​మెంట్​ఛార్జీలు, జీఎస్టీ, ఆదాయం పన్ను అంటూ సదరు సీనియర్​సిటిజన్ నుంచి విడతలవారీగా 30లక్షల రూపాయలను ఫోన్​పే, గూగుల్​పే యాప్​ల నుంచి తాను చెప్పిన అకౌంట్లకు బదిలీ చేయించుకున్నాడు. ఆ తరువాత మెయిల్​ద్వారా లోన్​అప్రూవల్​లెటర్లు కూడా పంపించాడు. అయితే, అవి నకిలీవని తేలటంతో సదరు సీనియర్​సిటిజన్​సైబర్​క్రైం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఐటీ యాక్ట్​సెక్షన్​66సీ, ఐపీసీ 420, 419 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి ఇన్స్​పెక్టర్​హరిభూషణ్​రావు, ఎస్​ఐలు సురేశ్, శైలేందర్​కుమార్, కానిస్టేబుళ్లు రవిశంకర్, రాము, మనీష్​కుమార్ తివారి, సాయికుమార్​ప్రత్యేక బృందంగా ఏర్పడి ఏసీపీ వీ.ఎం.ప్రసాద్​పర్యవేక్షణలో విచారణ ప్రారంభించారు.

ఢిల్లీ కేంద్రంగా..

దర్యాప్తులో ఈ మోసానికి పాల్పడ్డ ముఠా ఢిల్లీ కేంద్రంగా నేరాలు చేస్తున్నట్టు నిర్ధారించుకున్న సైబర్​క్రైం పోలీసుల బృందం అక్కడికి వెళ్లింది. హర్యానా రాష్ర్టం ఫరీదాబాద్​కు చెందిన తరుణ్​ఓఝా (31) మ్యాజిక్​ట్రిప్​ఇండియా పేర సంస్థను ప్రారంభించి మోసాలు చేస్తున్నట్టు తెలుసుకుని అతన్ని అరెస్టు చేసింది. అతనితోపాటు సంస్థలో భాగస్వామిగా ఉన్న గురుచరణ్​సింగ్​(26), మేనేజర్​గా పనిచేస్తున్న యోగేంద్రసింగ్​బదోరియా (29), టీం లీడర్​గా ఉద్యోగం చేస్తున్న షహదత్​అన్సారీ (25)లను కూడా అదుపులోకి తీసుకుంది.

మోసాలు ఇలా..

ప్రముఖ లోన్​కంపెనీలైన రిలయన్స్​క్యాపిటల్​ఫైనాన్స్​తదితర సంస్థలకు తాము ప్రతినిధులమని చెప్పుకొంటూ నిందితులు రుణాలు ఇప్పిస్తామంటూ ఫోన్​కాల్స్ చేయటంతోపాటు వాట్సాప్​మెసేజీలు, మెసేజీలు, ఈ మెయిళ్లను తాము నడుపుతున్న కాల్​సెంటర్​నుంచి బల్క్​గా పంపించేవారు. వీటికి ఎవరనా స్పందిస్తే వారిని నమ్మించి ఉచ్ఛులోకి లాగేవారు. ముందుగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆ తరువాత రకరకాల పేర్లతో డబ్బు గుంజేవారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇరవై ఏడు మందిని మోసం చేసి అయిదు కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టారు. ఇక, ఈ కేసులో మ్యాజిక్​ట్రిప్​కంపెనీ ఉద్యోగులైన నవీన్​కుమార్​(24), ప్రేంవీర్​సింగ్​(30), టెలీకాలర్లుగా పనిచేస్తున్న జ్యోతికుమారి (20), జాన్వీ తివారి (21), కంచన్​(23)లకు కూడా పాత్ర ఉన్నట్టు నిర్ధారించుకున్న ప్రత్యేక బృందం వీరిని విచారించటానికి 41(ఏ) సెక్షన్​ప్రకారం నోటీసులు జారీ చేసింది. వీరిని త్వరలోనే విచారించనున్నట్టు డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.

Next Story