ఉపాధ్యాయురాలైన భార్యను హత్య చేసిన భర్త.. ఆ పని చేయలేదనే.. తప్పించుకున్న కుమారుడు

by Bhoopathi Nagaiah |

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని ఉపాధ్యాయురాలైన భార్యను అతి దారుణంగా హత్య చేశాడో భర్త.

ఉపాధ్యాయురాలైన భార్యను హత్య చేసిన భర్త.. ఆ పని చేయలేదనే.. తప్పించుకున్న కుమారుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని ఉపాధ్యాయురాలైన భార్యను అతి దారుణంగా హత్య చేశాడో భర్త. కుమారుడు అడ్డుకోబోయినా ఆగకుండా ప్రాణాలు పోయే వరకు రుబ్బురాయితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గోరఖ్‌పూర్‌కు చెందిన ఆశా భారతి (36) స్థానికంగా కస్తూర్బా స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుంది. ఆమె భర్త రవి ప్రతాప్ మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. వారికి 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ప్రతినెల వచ్చే శాలరీ నుంచి తనకు రూ.15 వేలు ఇవ్వాలని భర్త కోరడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరికి ప్రతినెల రూ.5వేలు ఇచ్చేందుకు భార్య ఆశా భారతి అంగీకరించింది. అయినా తృప్తి చెందని భర్త రవి ప్రతాప్ మంగళవారం రాత్రి భార్య నిద్రిస్తుండగా ఆమెపై రుబ్బురాయితో దాడి చేశాడు. ఆ శబ్ధాలకు మేల్కొన్న కుమారుడు తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేసినా అతడిని సైతం కొట్టడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీసి స్థానికులను అప్రమత్తం చేశాడు. ఇంటి చుట్టు పక్కవాళ్లు రావడంతో భర్త రవి ప్రతాప్ పరారీ అయ్యాడు. రక్తం మడుగులో పడి ఉన్న ఆశాభారతిని స్థానికులు గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే, మార్గమధ్యలోనే ఆమె పరిస్థితి విషమించి మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గోరఖ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు రవి ప్రతాప్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story