రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-03 02:36:10  IST  )

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం (Markapuram) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్‌కు చెందిన కొందరు ఆటోలో వివాహానికి బయలుదేరారు ఈ క్రమంలోనే వారిని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 ఏళ్ల చిన్నారితో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నాగేష్ (17), ఆవుల నాగేశ్వరి (2)గా గుర్తించారు.

కాాగా, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ నివాసితులుగా గుర్తించారు. అదేవిధంగా ఇదే ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలిందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని మార్కాపురం పోలీసులు వెల్లడించారు. అయితే, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, అందులోనూ చిన్నారి మృతి చెందడంతో గిద్దలూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story