బడ్జెట్ సమావేశాల వేళ హైడ్రామా.. ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-24 09:28:19  IST  )

ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముంగిట బాంబు బెదిరింపులు కలకలం రేపుతోంది. ఆగంతకులు ఏకంగా స్పీకర్ విజయేందర్ గుప్తాకు ఈ-మెయిల్ పంపారు.

బడ్జెట్ సమావేశాల వేళ హైడ్రామా.. ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అసెంబ్లీ స్పీకర్ విజయేందర్ గుప్తా (Speaker Vijayender Gupta)కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అయితే, ఆ ఈ-మెయిల్‌లో అసెంబ్లీ ప్రాంగణాన్ని పేల్చివేస్తామని సందేశం ఉంది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు.

డాగ్, బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు..

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ బెదిరింపు రావడం హాట్ టాపిక్‌గా మారింది. సభలో కీలక చర్చలు జరగాల్సి ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ-మెయిల్ అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు.. డాగ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అసెంబ్లీ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని, ఇది ఆకతాయినల పని కావచ్చని భావిస్తున్నారు.

ఈ-మెయిల్‌పై పోలీసుల ఆరా..

అసలు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పీకర్ విజయేందర్ గుప్తా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.

ఢిల్లీ బడ్జెట్ 2026-27: విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు.. మహిళలకు నెలకు రూ.2,500 భరోసా

Next Story