రంగాపురం చెరువులో భారీగా చేపలు మృతి..

by Disha Web Desk 11 |
రంగాపురం చెరువులో భారీగా చేపలు మృతి..
X

దిశ, పెబ్బేరు: పెబ్బేరు మండల పరిధిలో రంగాపూర్ గ్రామ ఊర చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి. రెండు రోజులుగా పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సమాచారం అందుకున్న మత్స్యకారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న చేపలు.. అమ్ముకునే సమయంలో మృత్యువాత పడటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 10వేల వరకు చేపలు నీళ్ల పైకి తేలడంతో వాటిని మత్స్యకారులు తీసేశారు. శనివారం ఉదయం కూడా సుమరుగా మరో ఐదు వేలకు పైగా చేపలు నీటిపైకి తేలాయి.

దీంతో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. చేపలకు సరిపోను ఆక్సిజన్ అందకపోవడం వల్లే అవి మృత్యువాత పడ్డాయా.. చెరువులో ఎవరైనా విష ప్రయోగం చేశారా.. లేక ఏవైనా కలుషిత నీరు చేరి చేపలు మృత్యువాత పడ్డాయా అనే విషయం అధికారుల విచారణతో బయటపడే అవకాశం ఉంది. మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సంఘం నాయకులు కోరుతున్నారు.


Next Story