పని ఉందని పోయి.. రైలు పట్టాలపై శవమయ్యాడు

by Disha Web Desk 1 |
పని ఉందని పోయి.. రైలు పట్టాలపై శవమయ్యాడు
X

దిశ, పటాన్ చెరు : రోజులాగే కంపెనీకి పనికెళ్లిన వ్యక్తి.. వారమైన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరికి అదే వ్యక్తి మంగళవారం రైలు పట్టాలపై శవంగా ఛిద్రమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాకు చెందిన సతీష్ (44), భార్య శ్రీదేవి తమ పిల్లలు కొడుకు, కూతురుతో కలిసి ఉద్యోగ నిమిత్తం పటాన్ చెరు మండలం చిట్కుల్ పంచాయతీ పరిధిలో కిర్బీ కాలనీలో నివాసముంటున్నారు. పాశమైలారం కిర్బీ పరిశ్రమలో 22 ఏళ్లుగా సతీష్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే, గత నెల 31న రాత్రి డ్యూటీకి వెళ్లిన మృతుడు సురేష్ ఇంటికి తిరిగి రాలేదు. జూన్ 1న ఉదయం డ్యూటీ ముగిశాక పని మీద బయటకు వెళ్తున్న అని భార్యకు ఫోన్ చేశాడు. సాయంత్రం అయినా.. సురేష్ ఇంటికి తిరిగి రాలేదు. అతడికి ఫోన్ చెయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బీడీఎల్ భానుర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే, మంగళవారం నాగులపల్లి రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. ఆ మృతదేహం సతీష్ దిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. 22 ఏళ్లుగా కిర్బీ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సతీష్ కు ఈ మధ్య పరిశ్రమ అధికారుల వేధింపులతోనే బలయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలం నుంచి సతీష్ మృతదేహంతో బంధుమిత్రులు కలిసి కిర్బీ పరిశ్రమకు చేరుకుని గేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

యాజమాన్య వేధింపులతోనే సతీష్ బలయ్యాడని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు పరిశ్రమ ముందు నుంచి కదిలేది లేదని సుమారు ఐదు గంటలు అక్కడే బైఠాయించారు. ఎట్టకేలకు స్పందించిన పరిశ్రమ అధికారులు యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై బీ.డీ.ఎల్ భానుర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed