హత్యకు పాల్పడిన తండ్రీ, కొడుకులకు జీవిత ఖైదు

by Sridhar Babu |   (  Updated:2025-02-13 15:20:44  IST  )

భూమి హద్దుల విషయమై కక్ష పెంచుకున్న ఇద్దరు ఓ వ్యక్తిని హత్య చేయగా వారిద్దరికీ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 2500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

హత్యకు పాల్పడిన తండ్రీ, కొడుకులకు జీవిత ఖైదు
X

దిశ, కరీంనగర్ లీగల్ : భూమి హద్దుల విషయమై కక్ష పెంచుకున్న ఇద్దరు ఓ వ్యక్తిని హత్య చేయగా వారిద్దరికీ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 2500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన రాచమల్ల సంపత్ కు గ్రామంలోని సర్వే నెంబర్ 27 లో వ్యవసాయ భూమి ఉంది. కాగా అతని భూమి పక్కనే బోనగిరి ఓదెలుకు కూడా వ్యవసాయ భూమి ఉంది. కాగా వీరికి భూముల హద్దుల విషయంలో తరచూ గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.

అయినప్పటికీ గొడవలు సద్దుమణగక పోవడంతో 2020 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన వ్యవసాయ భూమి వద్ద ఉన్న రాచమల్ల సంపత్ ను బోనగిరి ఓదెలు అతని కొడుకు బోనగిరి జంపయ్య ఇనుప రాడ్డు, గొడ్డలితో కొట్టగా సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సీడీఓ సయ్యద్ పాషా, సీఎంఎస్ ఏఎస్ఐ తిరుపతి లు సాక్షులను కోర్టులో హాజరు పరచగా పీపీ జూలూరి శ్రీరాములు విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించడం తో పాటు రూ. 2500 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

Next Story