మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు ప్రయాణికులు స్పాట్ డెడ్

by Kema Shiva Kumar |

ఉదయ్‌పూర్ రైలులో మంటలు చెలరేగాయనే వదంతులతో చైన్ లాగి పట్టాలపైకి దూకిన ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది.

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు ప్రయాణికులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్‌లో మంటలు చెలరేగాయనే వదంతుల కారణంగా భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హేతంపూర్ (Hethampur) రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. పట్టాలపై ఉన్న ప్రయాణికులను మరో రైలు వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారితో సహా మొత్తం నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. పోలీసుల కథనం మేరకు.. ఉదయ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు హేతంపూర్ ప్రాంతానికి చేరుకోగానే, రైలులో మంటలు చెలరేగాయంటూ ఒక్కసారిగా పుకార్లు షికారు చేశాయి. దీంతో ఆయా బోగీల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవాలనే కంగారులో కొందరు ప్రయాణికులు వెంటనే ట్రైన్ చైన్ (Alarm Chain) లాగి రైలును ఆపేశారు. రైలు ఆగీఆగడంతోనే భయంతో బోగీల నుంచి కిందకు, పక్కనే ఉన్న రైల్వే పట్టాలపైకి దూకేశారు.

దూసుకొచ్చిన మరో రైలు..

ప్రయాణికులు అగ్నిప్రమాదం భయంతో పట్టాలపై నిలబడి ఉన్న సమయంలో అదే టైమ్‌లో పక్క ట్రాక్‌పైకి మరో రైలు దూసుకొచ్చి వారిని బలంగా ఢీకొట్టింది. చీకటిగా ఉండటం, వేగంగా వస్తున్న రైలును గమనించే లోపే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు ప్రయాణికుల బాడీలు ముక్కలై స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పట్టాలపై ఉన్న మరికొంత మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే రక్షక దళం (RPF), స్థానిక పోలీసులు స్పాట్‌కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Next Story