భూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

by Disha Web Desk 11 |
భూత్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ హై స్కూల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. భూత్పూర్ మున్సిపాలిటీ కి చెందిన బజారు ఆనంద్ (24), అతని సోదరి నాగమణి (26), మేనత్త వెంకటమ్మ అలియాస్ లక్ష్మమ్మ (60) కలిసి మోటార్ సైకిల్ పై మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఆసుపత్రికి వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నానికి తిరుగు పయనం అయ్యారు.

మోటార్ సైకిల్ వేగంగా ఉండడంతో భూత్పూర్ మున్సిపాలిటీ హై స్కూల్ మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే భూత్పూర్ సీఐ రజిత రెడ్డి, ఎస్సై భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story