నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు..గోడ కూలి కార్పెంటర్ మృతి

by Taduka Kalyani |

నిర్మాణ స్థలంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి ఓ కార్పెంటర్ మృతికి కారణమైన ఘటనలో ఇద్దరు నిందితులను కుల్సుంపురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు..గోడ కూలి కార్పెంటర్ మృతి
X

దిశ, కార్వాన్: నిర్మాణ స్థలంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి ఓ కార్పెంటర్ మృతికి కారణమైన ఘటనలో ఇద్దరు నిందితులను కుల్సుంపురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ రాములు కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంగద్ (36) జియాగూడలోని భరత్ నగర్‌లో నివసిస్తూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 22 రాత్రి దాదాపు 8:00 గంటల సమయంలో అంగద్ తన సహోద్యోగి దిలీప్ పాశ్వాన్‌తో కలిసి న్యూ గంగా నగర్ లేన్ గుండా నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక సైట్‌కు ఆనుకుని ఉన్న పాత గోడ ఒక్కసారిగా వారిపై కూలిపోయింది. తీవ్రంగా గాయపడిన అంగద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, దిలీప్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

మృతుడి సోదరుడు రోహిత్ పాశ్వాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి యజమాని యాద వినోద్ కుమార్, బిల్డర్ దుండిగల శ్రీనివాస్ సాగర్ కలిసి జిహెచ్‌ఎంసి నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే అక్కడ భారీగా తవ్వకాలు జరిపారని, నిర్మాణ స్థలం వద్ద ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన బారికేడ్లు, ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు వంటి ఎలాంటి కనీస రక్షణ ఏర్పాట్లు చేయలేదని, తవ్వకాలు జరుపుతున్న సమయంలో పక్కనే ఉన్న పాత గోడకు స్పష్టంగా పగుళ్లు వచ్చినట్లు గమనించినప్పటికీ, నిందితులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఆ గోడ కూలి అంగద్ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందనీ సీఐ పేర్కొన్నారు. యజమాని బిల్డర్ ను బుధవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Next Story