బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 09:29:14  IST  )

మావోయిస్టు పార్టీ అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలోనే కీలక పరిణాయం చోటుచేసుకుంది.

బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/భద్రాచలం: మావోయిస్టు పార్టీ అగ్ర నేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య ఇవాళ ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని, అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. నలుగురి మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు.

అయితే, వారిని గుర్తించాల్సి ఉందని అన్నారు. ‘ఆపరేషన్ కగార్‌’లో భాగంగా భైరామ్‌గఢ్ పరిధిలోని కేశ్‌కుతుల్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను అడ్డుకుని, ధ్వంసం చేయడానికి దాదాపు 50 మంది మావోయిస్టులు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు వారిపై మెరుపుదాడి దిగాయని వెల్లడించారు. మావోయిస్టుల ప్లాన్ గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డీఆర్‌జీ బృందాలు హుటాహుటిన కూబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయని.. ప్రస్తుతం ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.

Next Story