ఎల్లారెడ్డిపేటలో క్షుద్రపూజల కలకలం.. ఆడియో వైరల్, పోలీసులకు ఫిర్యాదు

by Bhanu |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఓ వ్యక్తిని హత్య చేయాలనే ఉద్దేశంతో సుపారి ఇచ్చి క్షుద్ర పూజలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఊహించని దిశలో మలుపులు తిరుగుతున్నాయి.

ఎల్లారెడ్డిపేటలో క్షుద్రపూజల కలకలం.. ఆడియో వైరల్, పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఓ వ్యక్తిని హత్య చేయాలనే ఉద్దేశంతో సుపారి ఇచ్చి క్షుద్ర పూజలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఊహించని దిశలో మలుపులు తిరుగుతున్నాయి. ఈ మేరకు సంబంధిత ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రజల్లో కలకలం రేపుతున్నాయి.

వివరాల ప్రకారం… మాచారెడ్డి మండలం రాజ్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన ఓ యువతిని, ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన యువకుడికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం జరిగిన తర్వాత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, పెళ్లైన అమ్మాయి తరఫున ఉన్న బంధువుల్లో ఒకరైన అధికం శంకర్ గౌడ్ (సింగరాయపల్లె గ్రామం, కామారెడ్డి జిల్లా) ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రాకేష్ అనే వ్యక్తిని సంప్రదించి, క్షుద్ర పూజల ద్వారా లేదా ప్రత్యక్షంగా హత్య చేయాలని సుపారి ఇచ్చినట్టు ఆడియో పుటేజీలు వెల్లడించాయి.

ఆడియోలో మరింతగా కలకలం రేపిన విషయం ఏమిటంటే… శంకర్ గౌడ్, రాకేష్‌కు ఫోన్‌పే ద్వారా 2024 ఏప్రిల్ 14న అడ్వాన్స్‌గా డబ్బు పంపినట్టు, మిగతా మొత్తం నకదు రూపంలో ఇచ్చినట్టు కూడా స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ ఆడియోలు వైరల్ కావడంతో బాధితుడి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. తనపై చావు దాడులు చేస్తున్నారంటూ బాధితుడు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇప్పుడు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలు, ఆడియో క్లిప్స్ వివరాలు అన్నీ పరిశీలించిన అనంతరం పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఈ ఘటన తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story