నకిలీ ఐటీసీ స్కాంపై కొనసాగుతున్న ఈడీ సోదాలు

by Ajay Maddhiboyina |

నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) స్కాంపై తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

నకిలీ ఐటీసీ స్కాంపై కొనసాగుతున్న ఈడీ సోదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) స్కాంపై తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్​, ఢిల్లీ, హర్యానా తమిళనాడులలో ఏక కాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌, మేడ్చల్ జిల్లాలో ఈడి అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో వినార్థ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.110 కోట్ల నకిలీ టర్నోవర్‌ను, నకిలీ ఇన్‌వాయిస్‌లను ఈడి అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు.

వాహన తయారీ, అమ్మకాల రికార్డులను కల్పించినట్లు, ప్రమోటర్లు, సరఫరాదారులు ప్రొఫెషనల్ ఫెసిలిటేటర్ల మధ్య మోసపూరితంగా క్లెయిమ్ చేసినట్లు, నకిలీ ఇ-వే బిల్లులు ఇచ్చినట్లు కంపెనీ నిర్వహకులు నేరం అంగీకరించారని వెల్లడించారు. గౌహతిలోని అమిత్ ట్రేడర్స్‌పై వచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదైనట్లు ఈడి అధికారులు తెలిపారు. దర్యాప్తులో శ్రీ రామ్ ఎంటర్‌ప్రైజెస్‌తో దాదాపు రూ. 700 కోట్ల విలువైన బోగస్ ఇన్‌వాయిస్‌లపై దాదాపు రూ. 116 కోట్ల నకిలీ ఐటీసీ ని పొందిందని గుర్తించనట్లు పేర్కొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో రెయిన్‌బో ఎంటర్‌ప్రైజెస్ ఎకే. ఎంటర్‌ప్రైజెస్ యజమానులు రూ. 2 కోట్లకు పైగా నకిలీ ఐటీసీని పొందినట్లు అంగీకరించారని వెల్లడించారు. మరో సంస్థ టానోర్ ఇంజనీరింగ్ రూ.4 కోట్ల నకిలీ ఐటీసీని పొందిందని పేర్కొన్నారు. హర్యానాలో, జై శ్రీ బాలాజీ ట్రేడింగ్ కో. రూ.87 కోట్లు, రూ.62 కోట్ల కల్పిత టర్నోవర్‌లను చూపిందని పేర్కొన్నారు. ఢిల్లీలో, మెస్సర్స్ ప్రిషా ఎగ్జిమ్ రూ. 200 కోట్ల టర్నోవర్ చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. నిందితులకు సబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు రికార్డులు రికవరీ చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story