- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు.. రూ.6.5 కోట్ల ముడి పదార్థాలు సీజ్
ఫామ్హౌస్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టారు.

దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ అంతర్రాష్ట్ర డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు చేధించారు. కోహీర్ పరిధిలోని పీచేర్యాగడి తండాలో ఉన్న 2 ఫామ్హౌస్లో ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ నడుస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం ఈ ఫామ్హౌస్పై మెరుపు దాడి (Raid) చేసింది.
రూ.6.5 కోట్ల విలువైన ముడి పదార్థాలు స్వాధీనం
పోలీసుల తనిఖీల్లో అక్కడ భారీ ఎత్తున ల్యాబ్ తరహా ఏర్పాట్లు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా బయటపడింది. ఈ దాడిలో సుమారు 3 కిలోల ప్రమాదకర ‘మెఫెడ్రోన్’ (Mephedrone) డ్రగ్స్తో పాటు, దాని తయారీకి ఉపయోగించే భారీ పరిమాణంలో ముడిపదార్థాలను (Raw Materials) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ ముడిపదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను ఈ ముఠా ముంబై నుంచి రహస్యంగా తరలించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్కు సమీపంలో ఉన్న సంగారెడ్డి గ్రామీణ ప్రాంతంలోని ఫామ్హౌస్ను నిందితులు సేఫ్ ప్లేస్గా ఎంచుకున్నారు. ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తూ.. వాటిని తిరిగి ముంబైతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఫామ్హౌస్లో డ్రగ్స్ తయారు చేస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికిన ముగ్గురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పట్టుబడిన డ్రగ్స్, ముడి పదార్థాలను కూడా సీజ్ చేశారు.






