నాగర్ కర్నూల్ జిల్లాలో డిఆర్ఐ అధికారుల దాడులు.. భారీగా ఆల్ఫాజోలం పట్టివేత..

by Disha Web Desk 11 |
నాగర్ కర్నూల్ జిల్లాలో డిఆర్ఐ అధికారుల దాడులు.. భారీగా ఆల్ఫాజోలం పట్టివేత..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్/బిజినపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో బుధవారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ కోళ్ల ఫారంలో భారీ ఎత్తున ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులకు గాని, అధికారులకు గాని సమాచారం లేకుండా నేరుగా డిఆర్ఐ అధికారులు రహస్యంగా దాడులు నిర్వహించారు. ఓ కోళ్ల ఫారంలో ప్రమాదకరమైన ఆల్పాజోలంను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. బావాజీ పల్లి గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆల్ఫాజోలంను, అలాగే దానిని తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మెడిసిన్, కల్తీ కల్లు తయారీ కోసం ఈ మాదకద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. గత కొంతకాలం కోళ్ల ఫారం కేంద్రంగా ఎవరికి అనుమానం రాకుండా ఈ మాదకద్రవ్యాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్నట్లు అందిన సమాచారంతోనే అధికారులు నేరుగా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మాదకద్రవ్యాన్ని కల్తీకల్లు కోసం తయారు చేస్తున్నారా లేక ఫార్మా కంపెనీలలో మెడిసిన్ కోసం తయారు చేస్తున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. హనుమంత్ రెడ్డి మాదకద్రవ్యాల తయారీ విషయంలో గతంలో ఒకసారి అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది.









Next Story

Most Viewed