హైదర్ గూడలో ఐదుగురి పై పిచ్చికుక్క దాడి..

by Disha Web Desk 20 |
హైదర్ గూడలో ఐదుగురి పై పిచ్చికుక్క దాడి..
X

దిశ, శంషాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడుతో పాటు మరో నలుగురి పై పిచ్చికుక్క దాడి చేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ ఎర్రబోడలో జరిగింది. పూర్తివివరాల్లోకి వెళితే హైదరాబాదులో ఓ చిన్నారిని వీధి కుక్కలు పొట్టన పెట్టుకున్న ఘటన మరువక ముందే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీధికుక్కలు బీభత్సం సృష్టించి ఐదుగురిపై దాడి చేశాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో వీధి కుక్క స్వైర విహారం చేసి ఓ ఇంటిముందు ఆడుకుంటున్న చేతన్ (8) బాలుడిని కరిచింది. అదే వీధిలో మరో ఇంటి ముందు ఆడుకుంటున్న పునీత్ (6) ను విచక్షణారహితంగా కరిచింది.

అంతేకాకుండా అడ్డం వచ్చిన మరో ముగ్గురిని కూడా కరుచుకుంటూ పారిపోయింది. ఈ దాడిలో చైతన్య, పునీత్ అనే ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా వెంటనే వారిని ఆస్పటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందించి వీధి కుక్కలను తీసుకొని వేరే ప్రాంతంలో విడిచిపెడుతున్నారని వేరే ప్రాంతం నుంచి తెచ్చి ఇక్కడ వదిలేస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. రోడ్ల పైన చిన్నారులు నడవాలంటే భయపడవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఒంటరిగా ఉన్న వ్యక్తులను, చిన్నారులను వీధి కుక్కలు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు.

Next Story

Most Viewed