సంపులో పడి మహిళ మృతి

by Taduka Kalyani |   (  Updated:2026-07-16 13:05:59  IST  )

ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి అంగవైకల్య మహిళ మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చోటు చేసుకుంది.

సంపులో పడి మహిళ మృతి
X

దిశ, ములుగు : ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి అంగవైకల్య మహిళ మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ అమృత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రుద్రారం శ్రీలత (36) చిన్ననాటి నుంచే పోలియోతో శారీరక వైకల్యంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉండేది. గురువారం ఉదయం ఇంటి ఆవరణలోని నీటి సంపు వద్ద చిన్న మోటారు పైపును అమర్చే ప్రయత్నంలో కాలు జారి సంపులో పడిపోయింది. అదే సమయంలో పశువుల పాకకు వెళ్లిన ఆమె తల్లిదండ్రులు తిరిగి వచ్చి చూడగా శ్రీలత కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా నీటి సంపులో పడినట్లు గుర్తించి స్థానికుల సహాయంతో బయటకు తీశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై మృతురాలి తల్లి రుద్రారం యెల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్కుక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story