కూతురు, అల్లుడు చేతిలో వృద్ధురాలు హతం..ఎందుకో తెలుసా..

by Disha Web Desk 20 |
కూతురు, అల్లుడు చేతిలో వృద్ధురాలు హతం..ఎందుకో తెలుసా..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కుటుంబ బాంధవ్యాల మధ్య ఇటీవల కాలంలో మనస్పర్థలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వృద్దాప్యంలో పట్టెడు అన్నం పెట్టలేక నిజామాబాద్ జిల్లాలో కన్ను కూతురే తల్లిని భర్తతో కలిసి మట్టుబెట్టింది. మంగళవారం రాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మహిపాల్ తాండలో మంగళవారం రాత్రి బదావత్ మనికి (80)ని కన్న కూతురు బుల్లి, అల్లుడు దశ్రులు గొడ్డలితో నరికి, కత్తితో పొడిచి హత్య చేశారు.

ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూడడంతో ధర్పల్లి సీఐ చంద్రశేఖర్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండలం పాకలాలకు చెందిన బదావత్ మనికి 20 ఏళ్ళ క్రితం సిరికొండ మండలం మహిపాల్ తాండకు పొట్టచేత పట్టుకుని వలస వచ్చింది. పాకలాలో ఉన్న వ్యవసాయ భూమిని విక్రయించి మహిపాల్ తాండలో పది ఎకరాలు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అక్కడే ఇళ్ళు కట్టుకుని నివసిస్తుంది. బదావత్ మనికికి ఇద్దరు కూతుళ్లు కాగా పెద్ద కూతురును మగ్దుల్ తాండకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించింది. ఆమె భర్త మరణించడంతో తల్లి వద్దనే ఉంటుంది.

చిన్న కూతురు బుల్లిని ధశ్రు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించి అల్లుడిని ఇల్లరికం తీసుకువచ్చకుంది. ఇటీవల కాలంలో వృద్దప్యంతో మనికి వస్తున్న పెన్షన్ డబ్బులను సైతం చిన్న అల్లుడు తీసుకుని అన్నం పెట్టకపోవడంతో దానిని ప్రశ్నించినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఈ విషయంలో గొడవ జరుగగా కూతరు, అల్లుడు దాడి చేయడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు రావడానికి యత్నించినట్లు ఆనవాళ్ళను గుర్తించారు. బదావత్ మనికిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.



Next Story

Most Viewed