మిధాని సంస్థపై ఎటాక్.. ఏకంగా రక్షణశాఖలో వేలు పెట్టిన సైబర్ నేరగాళ్లు!

by Disha Web Desk 2 |
మిధాని సంస్థపై ఎటాక్.. ఏకంగా రక్షణశాఖలో వేలు పెట్టిన సైబర్ నేరగాళ్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిధాని సంస్థ అధికారులనే బురిడీ కొట్టించారు. మిధాని నుంచి సైబర్ చీటర్స్ రూ.40 లక్షలు కొట్టేయడం కలకలం రేపుతోంది. మిధాని అధికారులు కెనడాకు చెందిన ఓ సంస్థ నుంచి అల్యూమినియం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన కొంత డబ్బు ఇప్పటికే చెల్లించారు. మిగతా డబ్బును పంపించాలని అయితే, ఇదివరకు పంపిన ఖాతాకు కాకుండా ఇప్పుడు తాము చెప్పబోయే అకౌంట్‌కు డబ్బులు పంపాలని ఆ సంస్థ నుండి మెయిల్ వచ్చింది. దీంతో గతంలో ఈ మెయిల్ సందేశాల ఆధారంగానే లావాదేవీలు కొనసాగుతున్న నేపథ్యంలో మెయిల్‌లో సూచించిన ఖాతాకు రూ.40 లక్షలను మిధాని అధికారులు బదిలీ చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి తమ వద్ద కొనుగోలు చేసిన అల్యూమినియంకు సంబంధించిన పెండింగ్ అమౌంట్‌ను త్వరగా పంపించాలని మిధాని అధికారులను కెనడా సంస్థ కోరింది. అయితే ఇదివరకే మీ సంస్థకు డబ్బును జమ చేసిన వివరాలను తెలియపరచడంతో అసలు విషయం బయటపడింది. దాంతో తమ సంస్థ మెయిల్ హ్యాక్‌కు గురైందని కెనడా సంస్థ గుర్తించింది.

ఈ వ్యవహారంలో ముందస్తు జాగ్రత్తగా మిధాని అధికారులు హైదరాబాద్ సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వైపు నుండి ఎలాంటి తప్పు జరగలేదని మిధాని అధికారులు కెనడా సంస్థకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మీ సంస్థకు చెందిన అధికారిక మెయిల్ ఐడీ నుండి వచ్చిన సందేశం ఆధారంగా తాము డబ్బు పంపించామని ఈ విషయంలో పొరపాటు మీదేనని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ మోసం జరిగిందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సైబర్ మోసంలో తమ సంస్థకు ఎలాంటి నష్టం కలగలేదని మిధాని అధికారులు స్పష్టం చేశారు. కాగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో మిధాని వంటి సంస్థపై సైబర్ నేరగాళ్లు కన్నేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భారత దేశంలోని రక్షణ శాఖలో హనీ ట్రాప్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో కెనడా సంస్థదే పూర్తి బాధ్యత అని మిధాని అధికారులు చెబుతున్నప్పటికీ కీలకమైన సంస్థ నుండి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నప్పుడు డబ్బులు పంపడానికి ముందు పంపిన తర్వాత అయినా ఇతర మార్గాల ద్వారా ఎదుటి వారిని సంప్రదించకపోవడం చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed