ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ దుర్మరణం

by Gantepaka Srikanth |

సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో కానిస్టేబుల్ వల్లపుదాసు సైదులు (43) ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ సైదులు తన సొంత గ్రామమైన పొనుగోడు నుంచి విధి నిర్వహణ కోసం బైక్‌పై సూర్యాపేట వస్తుండగా ఇమాంపేట వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఆయన ప్రయాణిస్తున్న బైక్ నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురవడంతో, సైదులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. సైదులు గత కొంతకాలంగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండే ఆయన ఆకస్మిక మరణవార్త విని తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆస్పత్రి వద్ద అందరినీ కలిచివేసాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం లేదా రోడ్డుపై ఏదైనా అవరోధం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Next Story