తండ్రి అండతో చెలరేగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కుమారుడు!?

by Disha Web Desk |
తండ్రి అండతో చెలరేగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కుమారుడు!?
X

దిశ, వెబ్‌డెస్క్ : తండ్రి ప్రజాప్రతినిధి.. అందులోనూ అధికార పార్టీ. ఏళ్ల తరబడి వ్యాపార రంగంలో ఉన్న కుటుంబం. ఆర్థికంగా ఎలాంటి లోటు లేకపోవడంతో చేతి నిండా డబ్బు. ఇంకేం అర్హతలు కావాలి జల్సాలు చేయడానికి. దీనినే ఉపయోగించుకున్నాడు ఓ యువకుడు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నాడు. గంజాయి మత్తులో కనిపించినా వారిపై దాడులు చేస్తూ చెలరేగిపోతున్నాడు. పోలీసులనూ చితక బాదుతున్నాడు. ఆ తర్వాత తండ్రి ఎంటరై.. కాంప్రమైజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది సూర్యాపేట జిల్లా కేంద్రంలో. ఈ రాజకీయ సుపుత్రుడు తాజాగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ కేసును కూడా ‘మాఫీ’ చేసేందుకు రంగంలోకి దిగారు అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వస్త్ర వ్యాపార రంగంలో మేటి ఆ కుటుంబం. తాతల కాలం నుంచి అదే వ్యాపారం చేస్తూ కోటిశ్వరుల జాబితాలో నిలిచారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి కొంతమంది వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ యువకుడి తండ్రి పట్టణంలోని ఓ పేరున్న ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. అయితే చేతినిండా డబ్బు, తండ్రి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో కొడుకు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఫ్రెండ్స్‌ను వెంటేసుకుని తిరుగుతూ మద్యం, గంజాయి సేవనానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో గంజాయి మత్తులో ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వహించే ఓ పోలీస్‌పై దాడికి పాల్పడ్డట్టు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన తండ్రి తన రాజకీయ పలుకుబడితో కేసు కాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ సమయంలో పోలీసులకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారని భానుపురిలో టాక్. ఆ తర్వాత కూడా గంజాయి మత్తులో మినీ ట్యాంక్ బండ్‌పై ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.

ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ యువకుడు తనకు ఇన్ స్ట్రాగ్రాంలో పరిచయమైన ఆంధ్రాకు చెందిన బాలికను సూర్యాపేటకు రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు సమాచారం. అయితే స్థానిక నాయకులు, పోలీసులు కలిసి బాలిక తల్లిదండ్రులకు కొంత నగదు ముట్టజెప్పి కేసు కాకుండా జాగ్రత్త పడ్డారని ఆ సమయంలో పట్టణంలో జోరుగా ప్రచారం జరిగింది. అయినా బుద్ది మార్పుకోని ఈ అధికార పార్టీ నేత కుమారుడు తాజాగా మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పుడు కూడా తన కుమారుడిపై కేసు నమోదు కాకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్ నేతలతో రాయబారం నడిపించి కుమారుడిని సేఫ్‌గా బయటకు తీసుకెళ్లే ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఈ విషయం సూర్యాపేట పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి అండదండలతో ఇలా వరుసగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed