లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

by Kema Shiva Kumar |

శంషాబాద్‌కు వస్తున్న లుఫ్తాన్సా LH-754 విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన మెయిల్‌తో ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది.

లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకతాయిల బాంబు బెదిరిపు ఈమెయిల్స్, కాల్స్‌కు అడ్డుకుట్టపటడం లేదు. తాజాగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వస్తున్న లుఫ్తాన్సా (Lufthansa) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన మెయిల్ కలకలం సృష్టించింది. దీంతో విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ (Frankfurt) నుంచి శంషాబాద్‌కు వస్తున్న LH-754 విమానంలో బాంబు ఉందంటూ విమానయాన సంస్థకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈమెయిల్ అందింది. విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ బెదిరింపు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించారు.

అనంతరం విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయిన వెంటనే, దానిని ఐసోలేషన్ బే (Isolation Bay)కు తరలించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ సహాయంతో విమానం మొత్తం, ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల తర్వాత విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ బెదిరింపు ఈమెయిల్ ఫేక్ అని తేల్చాడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తప్పుడు బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్‌ క్రైమ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Next Story