మంత్రాల నెపంతో దాడి.. చెట్టుకు కట్టేసి చితకబాదిన వైనం

by Chintha Aamani |

సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రాల నెపంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు.

మంత్రాల నెపంతో దాడి.. చెట్టుకు కట్టేసి చితకబాదిన వైనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రాల నెపంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అమానవీయ ఘటనను స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో సీపీ పోతరాజు సాయి చైతన్యకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు నేరుగా సీపీ కార్యాలయానికి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ సవిత అనే మహిళ నిజామాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో పని చేస్తోంది. అదే గ్రామానికి చెందిన సవిత బావ పల్లికొండ గంగారం తన ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెలు తరచూ సవిత ఇంట్లోకి వచ్చి మూత్ర విసర్జన చేయడం, బియ్యం తినేయడం చేస్తున్నాయి. దీంతో పలుమార్లు సవిత వారికి గొర్రెల విషయంలో తాను ఎదుర్కొంటున్న సమస్యపై గొర్రెల యజమాని గంగారామ్ కు కు ఫిర్యాదు చేసింది.

అయినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడంతో చివరకు పల్లికొండ సవిత పల్లికొండ గంగారాం కొట్టంలో ఉన్న గేదెను తీసుకొచ్చి గ్రామంలోని హనుమాన్​ మందిరం వద్ద ఉన్న చెట్టుకు కట్టేసింది. దీంతో కోపోద్రిక్తుడైన గంగారాం నా గేదెనే కట్టేస్తావా.. అంటూ.. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సవిత మంత్రాలు చేస్తోందని ఆరోపిస్తూ ఆమెను చెట్టుకు కట్టేసి అమానవీయ పద్ధతిలో చితకబాదారు. మతిస్థిమితం కోల్పోయిన భర్త, నలుగురు పిల్లలతో కలిసి అష్ట కష్టాలతో జీవితం నెట్టుకొస్తున్న సవిత తనకు జరిగిన అన్యాయంపై గత్యంతరం లేక మోపాల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని కోరిన పోలీసులు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో చివరకు సీపీ సాయిచైతన్యను కలిసి ఫిర్యాదు చేసేందుకు గురువారం సీపీ కార్యాలయానికి వచ్చానని ఆమె పేర్కొంది.

Next Story