హయత్ నగర్‌లో దారుణం: భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త!

by Kema Shiva Kumar |

హైదరాబాద్ హయత్ నగర్‌లో దారుణం చోటుచేసుకంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త, భార్యను సుత్తితో కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది..

హయత్ నగర్‌లో దారుణం: భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త!
X

దిశ, వెబ్‌‌డెస్క్: నగరంలోని హయత్ నగర్ (Hayathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. క్షణికావేశంలో ఓ భర్త తన భార్యను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, చివరికి పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. హయత్ నగర్ పరిధిలో నివాసముంటున్న దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన గొడవతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త క్షణికావేశంలో ఇంట్లోని సుత్తిని తీసుకుని భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయింది.

అయితే, భార్య పరిస్థితి విషమించడంతో భయపడిన నిందితుడు, అసలు విషయాన్ని దాచిపెట్టి డ్రామా ఆడాడు. ఆమె తల మీద పెయింట్ డబ్బా పడిందని కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని నమ్మించాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆమెను తక్షణమే యశోద ఆస్పత్రికి తరలించాడు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

నిజం బయటపెట్టిన కూతుళ్లు..

తండ్రి ప్రవర్తనపై, అతడు చెబుతున్న పెయింట్ డబ్బా (Paint Box) కథపై మృతురాలి కూతుళ్లకు అనుమానం కలిగింది. వెంటనే వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది. కుటుంబ కలహాల కారణంగానే తానే స్వయంగా సుత్తితో కొట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story