మావోయిస్టుల పేరుతో లేఖలు రాసిన వారి అరెస్ట్

by Disha Web Desk 1 |
మావోయిస్టుల పేరుతో లేఖలు రాసిన వారి అరెస్ట్
X

వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ భాస్కర్

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో రెండు రోజుల క్రితం మావోయిస్టుల పేరుతో పలువురు రాజకీయ నేతలకు వచ్చిన లేఖలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ లేఖల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీఖాన్ నేతృత్వంలో మూడు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. రాజకీయ నాయకులతో పాటు పలువురిని హెచ్చరిస్తూ వచ్చిన లేఖలు మావోయిస్టులు రాసినవి కావని పోలీసులు తేల్చారు.

ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్ భోగ లక్ష్మీరాజం (54) కు అదే గ్రామానికి చెందిన పోస్టుమాస్టర్ గా పని చేస్తున్న భోగ సత్తన్నకు మధ్య భూవివాదం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఇద్దరూ భోగ సత్తన్నకు అనుకూలంగా ఉంటున్నారనే నెపంతో వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు లక్ష్మీరాజం సమీప బంధువైన సిరిసిల్ల పట్టణానికి చెందిన పోలు ప్రకాష్ సహాయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ క్రమంలో పోలు ప్రకాష్ మావోయిస్టుల పేరుతో ఉన్న తెలుగు, హిందీ భాషల్లో లెటర్ హెడ్స్ తయారు చేసి లక్ష్మీరాజంకు అందజేసినట్లు గుర్తించామన్నారు. అయితే కేవలం భోగ సత్తన్నకు మాత్రమే లెటర్లు పంపిస్తే అనుమానం వస్తుందని ఆలోచనతో మండలంలోని సుమారు 50 మందికి పైగా రాజకీయ నాయకులకు ఈ ఉత్తరాలను పంపింనట్లుగా నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కంప్యూటర్, మానిటర్, కలర్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి మావోయిస్టుల కార్యకలాపాలు లేవని భోగ లక్ష్మీరాజం కేవలం వ్యక్తిగత కారణాలతోనే మావోయిస్టుల పేరు వాడి లేఖలు పంపించినట్లుగా తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీఖాన్, బీర్పూర్ సారంగాపూర్ ఎస్సైలు అజయ్, మనోహర్ రావు, పీసీలు రవి, జలంధర్, సుమన్ లను ఎస్పీ అభినందించారు.



Next Story