హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న ఆఫ్రికన్స్.. ఆ దందా చేస్తూ ఇక్కడే మకాం!

by Disha Web Desk 19 |
హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న ఆఫ్రికన్స్.. ఆ దందా చేస్తూ ఇక్కడే మకాం!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్‌లో అక్రమంగా నివాసముంటున్న విదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన ప్రకారం.. ప్రతీ యేటా ఆరు నుంచి ఎనిమిది కోట్ల మంది విదేశీయులు ఇండియాకు వస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌కు వచ్చేవారి సంఖ్య ఏడాదికి 50 లక్షలకు పైనే. వీరిలో టూరిస్టు వీసాలపై వస్తున్న వారే అధికం. ఆ తర్వాత స్టూడెంట్, మెడికల్ వీసాలపై వస్తున్నారు.

వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండిపోతున్నారు. ఆపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరిలో ఆఫ్రికన్ దేశాల వారే అధికంగా ఉంటుండగా.. డ్రగ్స్ సరఫరాలోనూ వీరే కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న వారూ ఉన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వీరి నెట్ వర్క్ విస్తరించి ఉన్నది. సరైన నిఘా లేకపోవడంతో పాటు పంపించడంలోనూ పోలీసు యంత్రాంగం విఫలమవుతున్నది.

నిఘా వైఫల్యం..

ఏ వీసాపై వచ్చినా విదేశీయులపై నిఘా పెట్టడం తప్పనిసరి. దీని కోసమే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ప్రత్యేకంగా ఫారినర్స్ వింగ్ పని చేస్తున్నది. తమ పేరు, దేశం, ఎందుకోసం వచ్చారు? ఎక్కడ, ఎన్ని రోజులు ఉంటున్నారు? వంటి వివరాలన్నీ వారికి తెలియజేయాలి. ఎయిర్ పోర్టుల్లోనూ ఫారినర్స్ కౌంటర్లను ఏర్పాటు చేసి వివరాలను తీసుకుని ఆయాన రాష్ట్రాల స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు పంపిస్తున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవటం అక్రమ చొరబాటుదారులకు కలిసి వస్తున్నది. వివిధ ఎయిర్ పోర్టుల్లో దిగుతున్న ఫారినర్లు.. ఆ తర్వాత రైలు, బస్సుల్లో దేశంలోని సిటీలకు చేరుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ వస్తున్న విదేశీయులపైనా మన పోలీసులు సరైన నిఘా పెట్టలేకపోతున్నారు.

ఆఫ్రికా దేశాల వారే అధికం

టూరిస్ట్, మెడికల్, స్టూడెంట్ వీసాలపై వస్తూ అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్న వారిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు చెందినవారే. ప్రధానంగా నైజీరియా, సూడాన్, సోమాలియా, ఘనా తదితర దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్, మెహదీపట్నం, రాజేంద్రనగర్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో నివాసముంటున్నారు.

నెట్ వర్క్‌గా ఏర్పడి..

దేశంలో అక్రమంగా ఉండే విదేశీయులు నెట్ వర్క్‌గా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా డ్రగ్స్ దందా చేస్తున్నారు. మత్తు పదార్థాలు ఎక్కువగా సముద్రమార్గం ద్వారా మన దేశానికి చేరుకుంటున్నాయి. ముంబై, గోవా, చెన్నైల్లోని పోర్టులకు చేరుతున్న మాదకద్రవ్యాలు అక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. కొంతకాలం కిందట నైజీరియా, టాంజానియాలకు చెందిన హెన్రీ చిగ్ బో ఉంబెయినీ, ఆమోబీచువాడీలు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుండగా హైదరాబాద్ నార్కొటిక్ వింగ్ అరెస్ట్ చేసి చేసింది.

రూ. లక్షల విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. ధవనంతుల పిల్లలతోపాటు సినీ పరిశ్రమకు చెందినవారికి డ్రగ్స్ అమ్ముతూ దొరికిన ఆఫ్రికన్ దేశస్తుల సంఖ్య పదుల్లోనే ఉంటుంది. ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న యువతుల్లో కొందరు ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు కూడా చేస్తున్నారు. స్టూడెంట్, మెడికల్ వీసాలపై వచ్చి టోలిచౌకీలో ఉంటూ ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు ఉగాండా దేశ యువతులను రాచకొండ పోలీసులు కొంతకాలం కిందట అరెస్ట్ చేశారు.

కార్డన్ సెర్చులతో గుర్తింపు

ఈ మొత్తం వ్యవహారంపై ఓ సీనియర్ పోలీస్ అధికారితో మాట్లాడగా అక్రమంగా ఇక్కడే ఉంటున్న విదేశీయులను గుర్తించి తిరిగి పంపించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తరచూ కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి వారిని గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : బ్రేకింగ్: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముంబైకి చెందిన నలుగురు అరెస్ట్!

Next Story