ఆరో తరగతి విద్యార్థినిపై యాసిడ్ దాడి.. అడ్రస్ అడిగే నెపంతో కిరాతకం!

by Gantepaka Srikanth |

మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది.

ఆరో తరగతి విద్యార్థినిపై యాసిడ్ దాడి.. అడ్రస్ అడిగే నెపంతో కిరాతకం!
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సంగమ్నేర్ తాలూకాలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న 11 ఏళ్ల చిన్నారిపై ఒక గుర్తుతెలియని దుర్మార్గుడు యాసిడ్‌తో దాడి చేశాడు. వడ్గావ్ పాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. వడ్గావ్ పాన్ గ్రామానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఎండల కారణంగా ప్రస్తుతం బడి ఉదయం పూట నడుస్తోంది. మధ్యాహ్నం 11:30 నుండి 12:45 గంటల మధ్య పాఠశాల ముగిసిన తర్వాత ఆ చిన్నారి తన సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో దారిలో ఒక గుర్తుతెలియని యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. ఏదో అడ్రస్ అడిగే నెపంతో మాట కలిపి, ఒక్కసారిగా ఆమె ముఖంపై యాసిడ్ పోసి అక్కడి నుండి పరారయ్యాడు.

స్థానికుల చొరవ.. ఆసుపత్రిలో చికిత్స..

యాసిడ్ పడటంతో ఆ చిన్నారి నొప్పితో విలవిలలాడుతూ కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి సహాయం కోసం పరుగున వచ్చారు. మొదట ఆమెను జంబుకర్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం లోణిలోని ప్రవరా నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి స్థిరంగా ఉందని, కుడి కంటి సమీపంలో ముఖంపై సుమారు 7 శాతం వరకు కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభించారు. సంగమ్నేర్ డివిజనల్ పోలీస్ అధికారి డాక్టర్ కునాల్ సోన్వనే నేతృత్వంలో భారీ పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. నిందితుడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఈ అమానుష ఘటనపై రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చిత్ర వాఘ్ నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

Next Story