కడెం కాలువలో పడి యువకుని మృతి

by Disha Web Desk 20 |
కడెం కాలువలో పడి యువకుని మృతి
X

దిశ, దస్తురాబాద్ : మండలంలోని దేవునిగూడెం గ్రామానికి బతుకమ్మ వేడుకలకు వచ్చిన యువకుడు అనంతలోకాలకు వెళ్ళాడు. యువకుడి మృతితో దేవునిగూడెంలో విషాదచాయలు అలుముకున్నా. ఈ సంఘటనకు సంబంధించి ఇంచార్జీ ఎస్సై కోసాని రాజు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవునిగూడెం గ్రామ సమీపంలోని కడెం ప్రధాన కాల్వలో ప్రమాదవశాత్తు బొమ్మెన శ్రీ దత్తు (15) పడి శుక్రవారం మృతి చెందాడు.

మృతుని తల్లి బొమ్మెన సుమలత ఈ నెల 6వ తేదీన దేవునిగూడెం గ్రామంలోని పుట్టింటికి తన ఇద్దరు కుమారులతో వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె పెద్ద కొడుకు శ్రీ దత్తు, ఆమె తమ్ముడు వేల్పుల నరేశ్ లు బతుకమ్మ పూల సేకరణకు గ్రామ శివారులోని కడెం ప్రధాన కాల్వ వైపు వెళ్ళారు. మధ్యాహానం 2 గంటల సమయంలో ఆమె తమ్ముడు వేల్పుల నరేశ్ కడెం కాల్వ అవతలి వైపు వెళ్ళి పూలను సేకరించి తీసుకొని రాగ, ఒడ్డుకు ఇటు వైపు ఉన్న శ్రీ దత్తు సేకరించిన పూలసంచి అందుకోబోయి ప్రమాదవశాత్తు కాలు జారీ ఆ కాల్వలో పడి కొట్టుకుపోయాడు.

ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని శ్రీ దత్తు కోసం గాలించగా శ్రీ దత్తు మృతదేహం లభించింది. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story