ఆర్మీలో పని చేసి ఆ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు.. భార్యను కుక్కర్‌లో ఉడికించినా దొరికిపోయిన భర్త

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-01-24 15:03:19  IST  )

మీర్‌పేట హత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. ఆర్మీ మాజీ జవాన్ తన భార్యను హత్య చేసిన విధానం వింటుంటే ఒళ్లు జలదిరిస్తోంది.

ఆర్మీలో పని చేసి ఆ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు.. భార్యను కుక్కర్‌లో ఉడికించినా దొరికిపోయిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్ : మీర్‌పేట హత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. ఆర్మీ మాజీ జవాన్ తన భార్యను హత్య చేసిన విధానం వింటుంటే ఒళ్లు జలదిరిస్తోంది. భార్యను తేలిగ్గానే చంపినా శవాన్ని మాయం చేయడానికి అతడు చేసిన ప్రయత్నం హాలీవుడ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్‌ను మించి ఉన్నది. చట్టంలోని ఎన్ని లోసుగులు తెలిసినా.. చిన్న లాజిక్క్ మర్చిపోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కానీ ప్రాణం లేని ఆ రెండే ఇప్పుడు అతడిని దోషిగా నిరూపించేందుకు సాక్ష్యంగా నిలవబోతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగింది

ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్న సమయంలో అదే జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బయ్య, వెంకట రమణ దంపతుల పెద్ద కుమార్తె వెంకటమాధవిని ఇచ్చి 13 ఏళ్ల క్రితం వివాహం చేశారు. అన్యోన్యంగా సాగిన సంసారానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత గురుమూర్తి ఆర్మీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోని హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. మీర్ పేట్‌లోని జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి భార్య వెంకట మాధవి (35)పై అనుమానం పెంచుకున్న గురుమూర్తి తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఈక్రమంలోనే భార్యను హత్య చేయాలని పథకం వేశాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సాగనంపాడు

భార్యను చంపేయాలని నిర్ణయించుకున్న గురుమూర్తి అదును కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. దీంతో ఈ నెల 13న భార్య, ఇద్దరి పిల్లలతో కలిసి తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ పిల్లలను వదిలేసి వచ్చారు. 14వ తేదిన మళ్లీ ఫ్యామిలీతో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వెళ్లారు. ఆ తర్వాత పిల్లలను తన సోదరి ఇంటి వద్ద వదిలి భార్యతో కలిసి గురుమూర్తి ఇంటికి వచ్చారు. 15వ తేది ఉదయం గురుమూర్తి మరో మహిళతో చనువుగా ఉన్న ఫొటోలను భార్య వెంకట మాధవి ఆయన ఫోన్లో చూసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే హత్య చేయాలనే ప్లాన్‌లో ఉన్న గురుమూర్తిని రోకలిబండతో మోది భార్యను హతమార్చాడు.

భార్య బొక్కలు చూర్ణం.. మాంసం ముద్దగా..

భార్యను హత్య చేసిన గురుమూర్తి శవాన్ని మాయం చేయడానికి పక్కా ప్లాన్ చేశాడు. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌ను చూసిన ఆయన పోలీసులకు ఏమాత్రం చిక్కకుండా, సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. ఫుల్‌గా మద్యం తాగి భార్య మృతదేహాన్ని బాత్ రూంకి తీసుకెళ్లి మేక మాంసాన్ని నరికినట్టు ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని బకెట్ లో వేసి హీటర్ ద్వారా బాగా ఉడికించాడు. ఆ తర్వాత బొక్కలు, మాంసాన్ని వేరు చేసి కుక్కర్‌లో బాగా ఉడికించాడు. బాగా ఉడికిన బొక్కలను రోట్లే వేసి చూర్ణం చేశాడు. శరీర భాగాల మాంసాన్ని మొత్తగా దంచి పేస్ట్ చేశాడు. వాటిని కవర్లలో వేసుకోని మీర్ పేట్ చందా చెరువులో కొంత, డ్రైనేజీల్లో మరి కొంత వెదజల్లాడు. ఆ తర్వాత ఇల్లును శుభంగా కడిగేశాడు. ఇదంతా చేయడానికి గురుమూర్తికి రెండు రోజులు పట్టింది. అయితే భార్యను చంపి ఇలా శవాన్ని మాయం చేయడానికి ముందుగానే గురుమార్తి ఓ కుక్కపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అప్పుడే మటన్ నరికే కత్తులను, కొత్త కుక్కర్లను కొనుగోలు చేసి పెట్టుకున్నట్లు సమాచారం.

డ్రామాకు తెర లేపి.. అనుమానితుడిగా మారి..

భార్యను చంపి శవాన్ని మాయం చేసిన గురుమూర్తి తనకు ఏం తెలియదన్నట్లు అత్తామామలకు సమాచారం ఇచ్చాడు. తనతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. అంతటితో ఆగకుండా మీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటి, పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. కానీ ఆమె ఒక్కతే వెళ్లిన దృశ్యాలు ఎక్కడా నమోదు కాలేదు. ఇంటి సమీపంలోని కెమెరాలో మాత్రం భర్తతో కలిసి నాలుగు రోజుల క్రితం ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన విజువల్స్ ఎక్కడా రికార్డు కాలేదు. మరోవైపు ఆమె మిస్సింగ్ అయినప్పటి నుంచి భర్త గురుమూర్తి పలుమార్లు వివిధ కవర్లతో బయటకు వెళ్లి రావడం రికార్డు అయ్యాయి. అతడి వ్యవహారశైలి సైతం అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు గురుమూర్తి.

పోలీసులకు సవాల్ విసిరిన ఆర్మీ మాజీ జవాన్

గురుమూర్తి తన భార్యను హత్య చేశానని ఒప్పుకున్నా.. అందుకు సాక్ష్యాలు లేకుండా చేశాడు. భార్య మృతదేహం కానీ, చంపిన ఆనవాళ్లు, క్లూస్ ఏదీ లేకుండా రూపుమాపాడు. అంతే కాదు.. నేను హత్య చేశాను.. కానీ మీరు కోర్టులో ఎలా నిరూపిస్తారు అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది. వెంకట మాధవి బొక్కల పొడి, ఆమె శరీర ముద్దల కోసం పోలీసులు చెరువులో, డ్రైనేజీలో వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంట్లో, బాత్ రూం, వంట గదిలో FSL టీంలతో సెర్చింగ్ చేశారు. రక్తం మరకల కోసం ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో వెతికారు. ఈ సమయంలో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ టీం గుర్తించింది. కాలిపోయిన మాధవి తల వెంట్రుకలు లభించాయి. వీటికి ఆధారంగా పిల్లల DNAతో సరిపోల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా గురుమూర్తి పక్కాగా చిక్కే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక హత్యకు ఉపయోగించిన కత్తులు, మొద్దు, కుక్కర్లు, హీటర్ ఇలా అన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు.

ఆమె కోసమే హత్యా..?

గురుమూర్తి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి సమీప బంధువైన ఓ మహిళతో గత కొన్నాళ్లుగా లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్యను రివర్స్‌గా నువ్వు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని వేధిస్తూ తరచూ గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. మాధవిని వదిలించుకోని ఆ మహిళతో కలిసి ఉండటం కోసమే భార్యను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పిల్లలతో సైలెంట్ కానీ వాళ్లతో మాత్రం..

తల్లి మిస్సింగ్ అయిందని తెలుసుకున్న పిల్లలు ఈ నెల 17న ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఏంటి ఈ వాసన అని అడిగినా తండ్రి ఎలాంటి సమాధానం చెప్పలేదు. అమ్మ ఏది అని అడిగినా మౌనంగానే ఉన్నాడు. కానీ భార్య శరీర భాగాలను కుక్కర్లో ఉడికించినప్పుడు, బొక్కలను, వెంట్రుకలను స్టౌవ్‌పై కాల్చినప్పుడు బాగా స్మెల్ వచ్చిందని.. ఆ సమయంలో ఏంటి ఈ వాసన అని అడిగితే యాట కాళ్లు, తలకాయ కాలుస్తున్నానని స్థానికులకు సమాధానం చెప్పినట్లు చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతడే హత్య చేసి శవాన్ని ఉడికించాడని తెలియడంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ల వాళ్లంతా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

పోలీసులకు సవాలుగా మారిన కేసు

భార్యను చంపి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించాడని తెలియడంతో నేషనల్ మీడియా సైతం మీర్ పేట్‌కు పరుగులు పెట్టింది. దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పెద్ద సవాలుగానే మారింది. హత్యకు గురైన మాధవి శరీర భాగాలు లభించకపోవడం, కనీసం ఆమె చనిపోయినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం పోలీసులకు క్లిష్టంగా మారింది. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో FSL టీంకు దొరికిన రక్తం మరకలు, కాలిన వెంట్రుకలతో పిల్లల డీఎన్ఏ మ్యాచ్ అయితేనే కేసు ముందుకు సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలీసులకు గురుమూర్తే హత్య చేసినట్లు ఎలాంటి క్లూలు దొరకలేదని తెలుస్తోంది. కోర్టులో కేసు నిలబడటంతోపాటు బలమైన సాక్ష్యాలను పోలీసులు చూపించి నిరూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఆధారాలు సేకరించడం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాతనే మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చే అవకాశం ఉందని లీగల్ టీం అభిప్రాయపడుతుంది. ఈ కారణంతోనే గురుమూర్తి ధీమాగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ కేసు పోలీసులకు ఓ ఛాలెంజ్‌గా మారే అవకాశం ఉంది.

Next Story