నగరం నడిబొడ్డున మరో ఘోరం.. ఇంటి యజమానురాలి దారుణ హత్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-30 05:52:44  IST  )

అద్దెకు ఉంటున్న ఇంటి యజమానురాలిని నగల కోసం అతి కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నగరం నడిబొడ్డున మరో ఘోరం.. ఇంటి యజమానురాలి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: అద్దెకు ఉంటున్న ఇంటి యజమానురాలిని నగల కోసం అతి కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీఐ ధనుంజయ కథనం మేరకు, మల్లాపూర్ (Mallapur) పరిధిలోని బాబానగర్‌ (Babanagar)లో భర్త, కుమారుడు మరణించడంతో సూరెడ్డి సుజాత (65) ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా, పేరవలి మండలం పరిధిలోని కొత్తపల్లికి చెందిన అంజిబాబు (33) డ్రైవర్‌గా పని చేసేందుకు నగరానికి వచ్చాడు. రెండు నెలల క్రితం సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. అప్పటి నుంచి అంజికి ఆమె ఒంటిపై ఉన్న నగలపై కన్ను పడింది. ఆమెను ఎలాగైనా అంతమొందించి బంగారాన్ని తీసుకుని సెటిల్ అవ్వాలని అనుకున్నాడు.

గుట్టుచప్పుడు కాకుండా చంపి.. గోదారిలో విసిరేసి

కాగా, ఈ నెల 19న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సుజాత గొంతును బలంగా నిలిపి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న 11 తులాల బంగారాన్ని తీసుకుని, మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి లాక్ చేసి వెళ్లిపోయాడు. చేసిన హత్య గురించి కందవల్లిలోని స్నేహితుడు యువరాజు, అమలాపురం మండలం వేమవరానికి చెందిన స్నేహితుడు దుర్గారావుకు చెప్పి, సొంతూరు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 20న ముగ్గురూ కారును అద్దెకు తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు. సుజాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కోనసీమ జిల్లాలోని కృష్ణలంక వద్ద గోదావరి నదిలో విసిరేశారు. ఆ తర్వాత తమకేమీ తెలియనట్లు సైలెంట్‌గా ఉన్నారు. అయితే, మొయినాబాద్‌లో నివసిస్తున్న సుజాత చెల్లెలు సువర్ణలత ఈ నెల 24న సోదరి ఇంటికి వచ్చారు. సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు, అద్దెదారుడైన అంజిబాబు కనిపించకపోవడాన్ని గమనించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్‌లో విచారించగా అతడు తానే సుజాతను హత్య చేశానని ఒప్పుకున్నాడు.

Read More..

బెంగళూరులో 'లక్కీ భాస్కర్' సీన్.. రూ. 3 కోట్లు స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్

Next Story