యాక్సిడెంట్ బాధితులను కాపాడబోయి ఎదురుగా వస్తున్న ట్రక్కుకు బలయ్యారు

by Dishafeatures2 |
యాక్సిడెంట్ బాధితులను కాపాడబోయి ఎదురుగా వస్తున్న ట్రక్కుకు బలయ్యారు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఘోరం జరిగింది. బైక్ నుంచి కిందపడ్డ వ్యక్తులను రక్షించబోయి ఎదురుగా వస్తున్న ట్రక్కుకు ఇద్దరు మహిళలు బలి కాగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటావా జిల్లాలోని ఆగ్రా-కాన్పూర్ జాతీయ రహదారిపై భార్యాభర్తలిద్దరూ బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ క్రమంలోనే వారికి తీవ్రగాయాలు కాగా నడవలేని పరిస్థితిలో రోడ్డు మీదే రక్తపు మడుగులో ఉన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న కొందరు వాళ్ల బైకులను ఆపి బాధితులను రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే ఎదురుగా స్పీడుగా వచ్చిన ట్రక్కు వాళ్లపై దూసుకెళ్లింది. దీంతో కాపాడటానికి వచ్చిన వాళ్లలో మిథిలేష్ దేవి (45), నేమా దేవ్ (43) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వాళ్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా హైవేపై పెద్ద వాహనాలు అతి వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయంటూ ప్రయాణికులు రోడ్డుపై రెండు గంటలపాటు ధర్నా చేశారు. చర్యలు తీసుకుంటామంటూ అధికారులు నచ్చజెప్పడంతో వారు శాంతించారు.

Next Story

Most Viewed