వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. పులివెందులలో కేసు నమోదు

by Dishafeatures2 |
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. పులివెందులలో కేసు నమోదు
X

దిశ,కడప: మాజీమంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి పై పులివెందుల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. పులివెందుల పట్టణంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలోని జయమ్మ కాలనీలో నివాసం వుంటున్న దస్తగిరి తన నివాసంలో అదే వీధికి చెందిన తన కుమారుడు గూగుడు వల్లీని నిర్భంధించి, చిత్రహింసకు గురి చేస్తున్నారని , అతడిని కాపాడాలంటూ అతని తల్లి కుళ్లాయమ్మ పోలీసులను సోమవారం రాత్రి ఆశ్రయించారు. దీంతో ఎస్.ఐ ఎస్.కె హుసేన్ తన సిబ్బందితో కలసి దస్తగిరి ఇంట్లో నిర్భందించిన ఆ బాలుడిని విడిపించాడు. తన వెంట తీసుకొచ్చి పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారు. వైద్య సేవల అనంతరం బాలుడిని స్టేషన్ కు తీసుకెలుతుండగా పోలీసులు వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బాధితుడి తల్లి కుళ్లాయమ్మ మాట్లాడుతూ నేను, నా భర్త గుగూడు వల్లితో కలసి పులివెందుల పట్టణం జయమ్మ కాలనీలో నివాసం వుంటున్నామన్నారు. నా భర్త మొదటి భార్య 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిందన్నారు. నన్ను 8 ఏళ్ల క్రితం గుగూడు వల్లీ రెండో వివాహం చేసుకున్నాడని తెలిపారు. అయితే మొదటి భార్య కు గూగుడు వల్లి (16), రేష్మా (15)సంతానం కాగా, నాకు గుగూడు వల్లికి ఇమ్రాన్, చాందినీ అనే ఇరువురు పిల్లలు వున్నారన్నారు. అందరమూ కలసి వున్నామన్నారు. అయితే కుటుంబ అవసరాల నిమిత్తం తన భర్త పెద్ద గూగుడువల్లీ, తాను కలిసి ఆరు నెలల క్రితం షేక్ దస్తగిరి వద్ద పూచీకత్తుగా ఇంటి పత్రాలను ఇచ్చి వడ్డీకి రూ.40 వేలు అప్పు తీసుకుని, వారం, వారం వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. బాకీ డబ్బుకు వడ్డీ వారానికి రూ.4 వేలు చొప్పున దస్తగిరి కి ఇస్తున్నామన్నారు. పది రోజుల నుంచి వడ్డీ కట్టలేక పోయామన్నారు. దీంతో అసలు వడ్డీతో కలిపి రూ.1,10,000 మాతో ప్రామిసరీ నోటు దస్తగిరి రాయించు కున్నారని ఆమె తెలిపారు. కాగా డబ్బు ఇవ్వాలని నా భర్తను ఒత్తిడి చేస్తూ వస్తున్నాడన్నారు.

ఈ క్రమంలో మా కుమారుడు గూగుడువల్లీని దస్తగిరి తన వెంట తీసుకెళ్లి అతని ఇంట్లో నిర్భందించారన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మా అంతు చూస్తామని బెదరించారన్నారు. బాలుడు గూగుడు వల్లీ మాట్లాడుతూ తనను ఇంట్లోనే నిర్భంధించి హింసించాడని పోలీసులకు వివరించారు. బాలుడి తల్లి కుళ్లాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ ఎస్.కె హుస్సేన్ తెలిపారు. ఈ క్రమంలో దస్తగిరిని పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు. తమ పై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Next Story

Most Viewed