ఛత్తీస్ గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి

by Disha Web Desk 19 |
ఛత్తీస్ గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు మరోసారి తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్‌లోని దంతెవాడలో బుధవారం జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు మందు పాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది జవాన్లు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. గాయపడ్డ వారిని రాయ్‌చూర్ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి చెందిన జవాన్లు అంతా డీఆర్‌జీ విభాగానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే, దంతెవాడ జిల్లాలోని అరన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందుకున్న డీఆర్‌జీ విభాగానికి చెందిన జవాన్లు కూంబింగ్‌కు బయలుదేరారు. జవాన్ల రాకను గమనించిన మావోయిస్టులు జవాన్ల ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను ఐఈడీతో పేల్చారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. మృతుల్లో 10 మంది జవాన్లు కాగా.. మరొకరు డ్రైవర్ ఉన్నట్లు విశ్వసనీయ సమచారం.

కాగా, ఛత్తీస్ గడ్‌లో ఇటీవల పోలీసులు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఢిపెన్స్ హెలికాప్టర్లు, డ్రోన్స్‌తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు మావోయిస్టు కీలక నేతలు సైతం ఎన్ కౌంటర్‌లో మరణించారు. ఇందుకు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక, మావోయిస్టుల దాడిలో 11 మంది జవాన్లు మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


Next Story

Most Viewed