- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతాపై సస్పెన్షన్.. పాక్ ప్లేయర్ కొనుగోలుపై ఫ్యాన్స్ ఫైర్ వల్లేనా?
ఇంగ్లాండ్ వేదికగా జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్’ లీగ్లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంగ్లాండ్ వేదికగా జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్’ లీగ్లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా అనూహ్యంగా సస్పెన్షన్కు గురైంది. పాక్ క్రికెటర్ను తీసుకోవడంపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఖాతా సస్పెన్షన్పై ఎక్స్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఖాతా ఏమైందనేది తెలియరాలేదు. ఫ్యాన్స్ మాత్రం నిన్నటి నుంచి పాక్ ప్లేయర్ కొనుగోలు విషయంపై భారీ స్థాయిలో సన్రైజర్స్ లీడ్స్ ఖాతాను టార్గెట్ చేశారు.
పోటీపడి మరీ దక్కించుకున్న కావ్యా మారన్
గురువారం ఇంగ్లాండ్లో జరిగిన ‘ది హండ్రెడ్’ లీగ్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి (సన్ గ్రూప్) చెందిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సన్రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి స్వయంగా పాల్గొన్నారు. ట్రెంట్ రాకెట్స్ జట్టుతో తీవ్రంగా పోటీపడి మరీ అబ్రార్ను సన్రైజర్స్ కొనుగోలు చేసింది. కాగా, ఈ జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సారథ్యం వహిస్తున్నాడు.
ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణాలివే..
ది హండ్రెడ్ లీగ్లోని మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ఎంఐ లండన్, సౌథరన్ బ్రేవ్, సన్రైజర్స్ లీడ్స్ జట్లలో భారత ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వాటాలున్నాయి. దీంతో పాక్ ఆటగాళ్లకు ఇక్కడ కూడా అవకాశం దక్కదని అభిమానులు భావించారు. కానీ లీగ్ నిర్వాహకులు అనుమతించడంతో వారు వేలంలోకి వచ్చారు. 2009లో ఐపీఎల్ నుంచి పాక్ క్రికెటర్లను నిషేధించిన తర్వాత, ఒక భారతీయ ఫ్రాంచైజీ యాజమాన్యం పాక్ ప్లేయర్తో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. దీనికి తోడు, గతంలో 'ఆపరేషన్ సింధూర్' సమయంలో అబ్రార్ అహ్మద్ భారత్ను అవమానిస్తూ పోస్టులు చేశాడని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాంటి ఆటగాడిని కొనుగోలు చేయడంపై కావ్యా మారన్ను, సన్రైజర్స్ యాజమాన్యాన్ని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సన్రైజర్స్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో, ఖాతాపై భారీగా రిపోర్ట్ చేయడం వల్లే ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్ అయి ఉంటుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.






