టీఆర్‌ఎస్‌కే సీపీఎం, సీపీఐ మద్దతు

by  |
టీఆర్‌ఎస్‌కే సీపీఎం, సీపీఐ మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ ఉప ఉన్నికల్లో వామపక్షాలు అభ్యర్థులను బరిలో నిలుపలేదు. మద్దతుపై ఇంతకాలం స్పష్టనివ్వలేదు. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్ది పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎట్టకేలకు సీపీఎం, సీపీఐలు మద్దతుపై స్పష్టనిచ్చాయి. టీఆర్ఎస్‌కే మద్దతు అని ప్రకటించాయి. పార్టీ కార్యకర్తలంతా ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని పిలుపు నిచ్చాయి. కాంగ్రెస్‌కు మద్దతు అని, బీజేపీకి మద్దతు అని, టీఆర్ఎస్‌కు మద్దతు అని వస్తున్న ఊహాగానాలకు తెరదించాయి.

అఖిలభారత స్ధాయిలో నిర్ణయం మేరకు సీపీఎం, సీపీఐ పార్టీలు ఏ ఎన్నికలు వచ్చినా తమ అభ్యర్థులను బరిలో నిలుపుతాయి. శ్రేణుల్లో నైరాశ్యం కలుగకుండా పార్టీ ఉందని భరోసా కల్పిస్తారు. ప్రచారంలో సైతం జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొంటారు. కానీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపలేదు. పార్టీ కార్యాచరణను ప్రకటించకపోవడంతో శ్రేణుల్లో కొంత సందిగ్ధం నెలకొంది. ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీపీఎం, సీపీఐలు తమ మద్దతుపై స్పష్టతనిచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలకు మద్దతు ఇవ్వొద్దని అఖిలభారత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈనెల 10న నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం ముకుందాపురంలో సీపీఎం, సీపీఐ ఉభయపార్టీల నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాయి. ఆ సమావేశంలో టీఆర్ఎస్‌కు మద్దతీస్తున్నట్లు తీర్మానించినట్లు రెండు పార్టీల జిల్లాకార్యదర్శులు నెల్లికంటి సత్యం, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు తెలిపారు. అఖిలభారత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు టీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, లక్ష్మీపతి,నర్సింహ పాల్గొన్నారు.

2018 ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌కు మద్దతు

శాసనసభకు 2018 జరిగిన ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. సీట్ల సర్దుబాట్లలో భాగంగా సాగర్ సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది. దీంతో సీపీఐ అభ్యర్థిని బరిలో నిలుపలేదు. కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసింది. సీపీఐకి సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడ్, పెద్దవూర, సాగర్, తిరుమగిరి మండలాల్లో పట్టుంది.

బీఎల్పీ అభ్యర్థికి సీపీఎం మద్దతు

బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్‌లో అభ్యర్థిని బరిలో నిలుపడంతో సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో ఎవరి మద్దతు లేకుండా పోటీ చేసిన సీపీఎం 1.28శాతం ఓట్లను సాధించింది. అయితే ఈ పార్టీకి నిడమనూరు, త్రిపురారం, హాలియా మండలాల్లో పట్టుంది.

రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మద్దతు: నెల్లికంటి సత్యం, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి

సీపీఎం, సీపీఐలు అఖిలభారత స్థాయిలో జాతీయ పార్టీలకు మద్దతు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నాయి. ప్రాంతీయ పార్టీలకే మద్దతు అని స్పష్టం చేశాయి. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాం. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించాం.

Next Story

Most Viewed