ప్రభుత్వ రక్షణలో ల్యాండ్ మాఫియా : నారాయణ

by  |
ప్రభుత్వ రక్షణలో ల్యాండ్ మాఫియా : నారాయణ
X

దిశ, క్రైమ్‌బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ రక్షణలోనే ల్యాండ్ మాఫియా కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. హఫీజ్ పేట్ భూ వ్యవహారంలో పేదలకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం నిర్వహిస్తామని, అందుకు ప్రజలంతా ప్రజా ఉద్యమంగా కదిలి రావాలని, అందుకోసం ఎన్నిసార్లయినా.. జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, న్యాయవాది నిరూప్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నాయని ద్వజమెత్తారు. ప్రభుత్వంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలంతా నయూం లాంటి వ్యక్తులతో భూ దందాలు నిర్వహించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నాటి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను పలుమార్లు కలిసి హఫీజ్ పేట భూ వ్యవహాకరంపై ఇదంతా భూ దందా అని నిరూపించామని అన్నారు. హఫీజ్ పేట్‌లో ధర్నాలు కూడా చేపట్టామన్నారు. అనంతరం మా వద్దకు భూమా నాగిరెడ్డి న్యాయవాది నంటూ ఓ వ్యక్తి వచ్చాడని చెప్పారు. ప్రభుత్వ భూములలో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు ఆనాడే చెప్పినట్టు తెలిపాడు. అయితే, ఈ విషయంపై మళ్లీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్దంగా ఉన్నామన్నారు. ఉంటే జైలులో ఉంటాం.. లేదంటే, హఫీజ్ పేట భూమిలో ఉంటామని హెచ్చరించారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాకా.. ప్రభుత్వ భూములన్నీ మాయం అవుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపదను కాపాడే విషయంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో రూ.35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పలు రకాల వివాదాల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు ల్యాండ్ ఆర్మీ ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు భూములు ఎందుకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్యక్రమంలో జస్టీస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్, విఠల్, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, ఓయూ విద్యార్థి నాయకుడు మహిపాల్, టఫ్ నాయకులు నలమాస కృష్ట తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed