అందర్నీ గెలిపిస్తారటగా.. మమ్మల్నీ గెలిపించండి: స్వరూపనందతో నారాయణ

by  |
అందర్నీ గెలిపిస్తారటగా.. మమ్మల్నీ గెలిపించండి: స్వరూపనందతో నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఆధ్యాత్మికత ఎక్కువనే చెప్పాలి. సామాన్య ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా భక్తిభావం ఎక్కువే. అందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తీసిపోరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ సైతం స్వరూపనందేంద్ర స్వామికి భక్తుడిగా మారిపోయారు. జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా స్వరూపనంద ఆశీస్సులు తీసుకోకుండా చేయరని ప్రచారం. 2019 సాధారణ ఎన్నికల్లో జగన్ చేపట్టబోయే ప్రతీ కార్యక్రమానికి స్వామి వారి ఆశీస్సులు తీసుకునేవారంటే ఆయనకు స్వామీజీపై ఉన్న భక్తి ఎంతో ఇట్టే అర్థమవుతుంది.

తమ నాయకుడు స్వరూపనంద ఆశీస్సులు తీసుకుంటే తాము ఎందుకు తీసుకోకూడదు అనుకున్నారో ఏమో వైసీపీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం శారదా పీఠానికి క్యూ కట్టారు. దీంతో శారదా పీఠం వైసీపీ అభ్యర్థులు అభిమానులతో కలకళలాడింది. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవుల కోసం కూడా పలువురు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో శారదా పీఠం ఒక్కసారిగా రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అయినప్పటికీ రాజకీయ నేతల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం శారదాపీఠాన్ని సందర్శించారు. స్వరూపంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో 97వ వార్డు అభ్యర్థిగా సీపీఐ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి యశోధతో కలిసి స్వామీజీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీతో నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని సమాచారం. స్వామీజీ ! మిమ్మల్ని కలిసి గెలిపించాలని కోరిన వారందరినీ గెలిపిస్తారంటగా..మా అభ్యర్థిని కూడా గెలిపించండి.

పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారు అంటూ స్వామిజీకి విన్నవించినట్లు తెలుస్తోంది. విశాఖ జీవీఎంసీ 97 వ వార్డు సీపీఐ అభ్యర్థి ఆర్ యశోధ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చిన ముసిడివాడ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మార్గమధ్యలో ఉన్న విశాఖ శారదా పీఠంను సందర్శించారు. నాస్తికులం అని చెప్పుకునే కమ్యూనిస్టు నాయకులు పీఠాన్ని సందర్శించడం..ఆపై స్వామీజీకి వంగివంగి దండాలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.


Next Story