కోలుకొండ గుట్ట కబ్జా.. అక్రమంగా మట్టి దందా : రమేష్ రాజా

by  |
Kolukonda Gutta
X

దిశ, దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కోలుకొండ గ్రామంలో సహజ వనరులైన గుట్టలను అధికార పార్టీ నేతల, అధికారుల అండదండతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఐ(ఎమ్ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి, సహజ వనరుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. శనివారం దేవరుప్పుల మండలంలోని కోలుకొండ గ్రామంలోని గుట్టలను భూపోరాట కమిటీ అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్‌తో ఆయన కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గుట్టను యంత్రాలు పెట్టి తవ్వుతున్నారని, ట్రాక్టర్ల ద్వారా మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

సహజసిద్ధమైన వనరులు కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కాంట్రాక్టర్లు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి మట్టి దందాకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే మట్టి తవ్వకాలను నిలిపేయాలని, సహజవనరులను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకులు జీడి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed