నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు: సీపీ సజ్జనార్

by  |

దిశ, రంగారెడ్డి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ ఆదేశించారు. గురువారం రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో ఆయన పర్యటించారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జన్నార్‌ మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టాలంటే లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చేవారికి 3 కిలోమీటర్ల లోపు మాత్రమే అనుమతి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌, లైసెన్స్‌, ఆధార్‌ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. పోలీసులు ఎక్కడ నిలిపి తనిఖీలు చేసినా ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించడమే కాకుండా, అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని సీపీ సజ్జన్నార్‌ హెచ్చరించారు.

Tags: corona, lockdown, cyberabad cp sajjanar, rangareddy

Next Story

Most Viewed