‘సర్కారు’లో మాయం.. ‘ప్రైవేటు’లో ప్రత్యక్షం

by  |
‘సర్కారు’లో మాయం.. ‘ప్రైవేటు’లో ప్రత్యక్షం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :

సర్కారు దవాఖానలో కొవిడ్ ​పేషెంట్లు మాయం అవుతున్నారు. కొందరు ప్రైవేటు దవాఖానల ఏజెంట్లు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తామని మాయమాటలు చెప్పి వారిని బుట్టలో వేసుకుంటున్నారు. ఆస్పత్రుల పేర్లతో ఉన్న యూనిఫారాలను ధరించి కొవిడ్ ​వార్డుల నుంచే బాధితులను తమ అంబులెన్స్​లో ‘ప్రైవేటు’కు తరలిస్తున్నారే ఆరోపణలున్నాయి. పాజిటివ్​ రిపోర్టు వచ్చినప్పటి నుంచి వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించే వరకూ దళారులు చేయని ప్రయత్నం లేదు. తీరా అక్కడ అడ్మిట్​అయ్యాక అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో మొదటి నుంచీ బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది. లాక్​డౌన్​ సమయంలో ప్రభుత్వ వైద్యులు ప్రాణాలను ఫణంగా పెట్టి ట్రీట్​మెంట్​ చేశారు. జూలై లో వైరాలజీ ల్యాబ్ ప్రారంభం కాగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పరీక్షలు చేశారు. ఆగస్టులో నిజామాబాద్ కొవిడ్ ఆస్పత్రిలో బెడ్లు, ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్ల సామర్థం కలిగిన 276 పడకల దవాఖానగా ఎంతో మందికి సేవలందించింది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, నాందేడ్, జగిత్యాల జిల్లాల కరోనా రోగులకు ధర్మాసుపత్రి పెద్ద దిక్కుగా మారింది

అయితే ఇదంతా గత నెలలో ప్రైవేట్ ఆసుపత్రులకు సర్కారు అనుమతి ఇచ్చే వరకే. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో గత నెలలో ప్రైవేటు, కార్పొరేట్​ దవాఖానల్లో కొవిడ్​వైద్య సేవలకు సర్కారు అనుమతి ఇచ్చింది. నిత్యం పాజిటివ్​ వచ్చిన వారి సంఖ్య పెరుగుతుండడం.. వారికి సరిపడా సర్కారు దవాఖానల్లో వసతి లేకపోవడం కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వరంగా మారింది. అయితే సదరు ఆసుపత్రికి సంబంధించిన పేర్లు ఉన్న యూనిపారాలను ధరించిన ఏజెంట్లు నిజామాబాద్​ కొవిడ్ ​దవాఖానలో వైద్యం తీసుకుంటున్న బాధితులకు మాయమాటలు చెప్పి అక్కడ నుంచి ‘ప్రైవేటు’కు తరలిస్తున్నారు.

సర్కారు దవాఖానల్లో పనిచేస్తూ సొంతంగా దవాఖానాలు నిర్వహిస్తున్న కొందరు డాక్టర్లు ఏజెంట్ల ద్వారా పాజిటివ్​వచ్చిన బాధితులను తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేసే ప్రతినిధుల (ఏజెంట్లు)కు వేతనాలతో పాటు పాజిటివ్​రోగిని తీసుకొస్తే అదనంగా కమీషన్ ఇస్తున్నారు. ఇక ఆర్​ఎంపీ, పీఎంపీలకు నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులను జమ చేస్తున్నారు. అయితే హాస్పిటల్​లో జాయిన్​అయిన బాధితుడి నుంచి పరీక్షలు, వైద్యం పేరుతో రూ. లక్షల్లో గుంజుతూ దోపిడీ చేస్తున్నారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed