‘తాత’ పోయాడని మనవరాలి హల్‌చల్..

by  |
‘తాత’ పోయాడని మనవరాలి హల్‌చల్..
X

దిశ, అంబర్ పేట్ : కరోనాతో ఓ వృద్ధుడు (88) మృతిచెందడంతో అతని మనవరాలు ఆసుపత్రి అధికారులతో గొడవ దిగడమే కాకుండా ఏకంగా సామాగ్రిని ధ్వంసం చేసిన ఘటన కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీసులు, ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ కథనం ప్రకారం.. బోడుప్పల్లో నివాసముండే ఓ వృద్ధుడికి కరోనా సోకింది. కుటుంబ సభ్యులు అతడిని ఈనెల 20న కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు వృద్ధుడిని పరీక్షించి వెంటనే అడ్మిట్ చేసుకుని ఐసీయూకి తరలించి చికిత్స అందించారు.

గురువారం రాత్రి సదరు వృద్ధుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మృతి చెందాడు. అతని మృతిని వైద్యులు నిర్ధారించగానే అక్కడే ఉన్న మృతుడి మనవరాలు కోపంతో వెంటిలేటర్‌ను నెట్టివేయడంతో పాటు అక్కడి వైద్య సిబ్బందితో గొడవకు దిగింది. పెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించడంతో ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. నారాయణగూడ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సదరు యువతిని అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తరలించారు. అయితే సదరు యువతి చేసిన పని వల్ల వెంటిలేటర్ స్క్రీన్ పూర్తిగా పగిలిపోయింది. దీంతో ఆసుపత్రిలో గందరగోళం సృష్టించి సామాగ్రి ధ్వంసం చేసిన యువతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులు పోలీసులకు శుక్రవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed