దేశంలో 19.8% పాజిటివిటీ రేటు

by  |
దేశంలో 19.8% పాజిటివిటీ రేటు
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివిటీ రేటు 19.8శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. అంటే ప్రతి వంద మందిలో దాదాపు 20 మంది కొవిడ్ బారిన పడుతున్నారన్నమాట. హెల్త్ బ్రీఫింగ్‌లో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 19.8శాతం పాజిటివిటీ రేటు ఉందని, ఇది గతవారం 21.9శాతంగా ఉన్నట్టు వెల్లడించారు. గతవారంతో పోలిస్తే ఈవారం పాజిటివిటీ రేటు దాదాపు 2శాతం తగ్గిందని అన్నారు. అలాగే, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ ఉత్పత్తి నెలకు 1.5కోట్లుగా ఉందని, దీన్ని 10కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

కొత్తగా 3.26 లక్షల కేసుల.. 3,890 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్నిరోజులుగా డైలీ కేసుల సంఖ్య 4లక్షల మార్క్‌కు తాకనప్పటికీ, మరణాలు మాత్రం 4వేలు, దానికి చేరువలోనే నమోదవుతుండటం ఆందోళనకరం. కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 3,26,098 మంది వైరస్ బారినపడగా, 3,890 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరగా, మరణాలు 2,66,207కు పెరిగాయి. 36,73,802 యాక్టివ్ కేసులున్నాయి.



Next Story

Most Viewed