భారీగా తగ్గిన బంగారం డిమాండ్

by  |
భారీగా తగ్గిన బంగారం డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయంగా బంగారం డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా క్షీణించింది. జులై-సెప్టెంబర్ మూడో త్రైమాసికంలో దేశీయ బంగారం డిమాండ్ 30 శాతం తగ్గి 86.6 టన్నులకు చేరుకుందని ప్రపంచ బంగారం మండలి(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. 2019 మూడో త్రైమాసికంలో బంగారం డిమాండ్ 123.9 టన్నులుగా నమోదైనట్టు డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక తెలిపింది.

కరోనా వ్యాప్తి వల్ల లాక్‌డౌన్ అమలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గిందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం చెప్పారు. ప్రతి ఏటా సెప్టెంబర్ త్రైమాసికంలో పండుగ సీజన్, పెళ్లిల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లుగా భారీగా ఉంటాయని, ఈ ఏడాది కరోనా భయం, భౌతిక దూరం వల్ల పండుగలు, పెళ్లిళ్లు తగ్గాయి.

వ్యాప్తి నియంత్రణలో భాగంగా వినియోగదారులు దూరం పాటించాల్సి రావడం, మాస్కులు ధరించడం వంటి కారణాలతో ఆభరణాల స్టోర్లు వెలవెలబోయాయని బంగారం రిటైల్ దుకాణదారులు చెబుతున్నారు. వినియోగదారుల నుంచి ఆసక్తి లేకపోవడం వల్ల డిమాండ్ క్షీణించినట్టు మార్కెట్ నిపుణులు తెలిపారు. అయితే, కరోనా వల్ల ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ 70 శాతం క్షీణించి 64 టన్నులుగా నమోదైంది.

ఇదే సమయంలో బంగారం కొనుగోళ్లు క్షీణించినప్పటికీ ధరలు పెరగడం విశేషం. సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం పెట్టుబడులు 52 శాతం వృద్ధితో 33.8 టన్నులుగా నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా పరిస్థితుల నుంచి అన్ని రంగాలు కోలుకుంటున్నాయని, ఈ దసరా, దీపావళి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని సోమసుందరం అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed